తిరుపతి పోరు: రత్నప్రభపై జనసైనికుల అసంతృప్తి నిజమే -ఉప సేనాని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు -పవనే సీఎం
జనసేన, బీజేపీ కూటమిలో జూనియర్ భాగస్వామి ఎవరో, సీనియర్ స్థానం ఎవరిదో క్లారిటీ ఇస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ కోరిక కూడా అని సోము ప్రకటించిన కొద్ది గంటలకే జనసేన వైపు నుంచి రియాక్షన్ వెలువడింది. ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సోమవారం జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం
100శాతం పవన్కే ఆ సత్తా..
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. సీఎం కాగల సత్తా 100 శాతం పవన్కే ఉందన్నారు. జనసైనికులు కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యం విజయవంతమవుతుందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని ఆయన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.
ఇంతకీ సోము ఏమన్నారంటే..
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, జనసేనలు ఆదివారం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ''ఇరు పార్టీలూ కలిసి బలమైన శక్తిగా మారి, ప్రజలకు మేలు చేస్తాయి. సీఎం జగన్ నవరత్నాలు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ప్రధాని మోదీ వివిధ పథకాల ద్వారా అంతకంట ఎక్కువే మేలు చేశారు. గతం నుంచీ ఉపాధి హామీకి దండిగా నిధులిస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే మోదీకి ఎంతో అభిమానం. 2014లో ఓసారి మోదీ నాతో స్వయంగా అన్నారు.. 'పవన్ ను మనం గౌరవించుకోవాలి, ఏపీకి అధిపతి అయ్యేది పవన్ కల్యాణే, ఈ విషయాన్ని స్ఫూర్తిమంతంగా తీసుకోవాలి' అని. గతంలో గ్రామాల్లో కాపుసారా కాసేవాళ్లు. ఇప్పుడు జగనే బూమ్ బూమ్ అని కాసేస్తున్నారు. ఎర్రచందనాన్ని దోచేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన సమన్వయంతో పనిచేసి విజయం సాదించాలి'' అని వ్యాఖ్యానించారు. వీర్రాజు కామెంట్లను గుర్తుచేయడంతోపాటు మనోహర్ ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..
ప్రజలకే అర్థం కాలేదు..
నిజాయితీగా, నిలకడగా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసే మనిషి పవన్ కల్యాణ్ ఒక్కరే అని గత ఎన్నికల్లో ఎంతగానో చెప్పినా ప్రజలు అర్థం చేసుకోలేకపోయారని నాదెండ్ల అన్నారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ప్రజలకు పవన్ పై విశ్వాసం పెరిగిందన్న విషయం రూఢీ అయిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో 96 శాతాన్ని గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడుకోకుండా ఉంటే వైసీపీకి ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని జనసేన నేత ప్రశ్నించారు.
ఆ విషయంలో జగన్ ఘనత కాదనలేం
జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల్లో ముంచేసిందని, అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారని, ఈ విషయంలో మాత్రం జగన్ ఘనతను కాదనలేమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, సిమెంట్ ద్వారా వస్తున్న డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి, తమ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని మనోహర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా,
జనసైనికుల్లో అసంతృప్తి నిజమే
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పోటీ చేస్తుండటంపై కొందరు జనసైనికులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనని నాదెండ్ల మనోహర్ అంగీకరించారు. అయితే, ఇతర పార్టీల అభ్యర్థుల కంటే తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మెరుగైన అభ్యర్థి అని, ఆమె విజయం కోసం జనసైనికులంతా పని చేయాలని పిలుపునిచ్చారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పడం జనసేనకు ఉన్న బలానికి నిదర్శనమని, సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలని, ప్రతి క్రియాశీలక సభ్యుడికి రూ. 5 లక్షల బీమా చేయిస్తున్నామని మనోహర్ వివరించారు.
అమిత్ షా.. శవ రాజకీయాలు చాలించు -హాత్రస్ హత్యాచారంపై నోరు విప్పలేదేం?: బెంగాల్ సీఎం మమత ఎదురుదాడి