ఆ తరువాతే జగన్పై 30 కేసులు : చంద్రబాబు దిట్ట..అడ్డంకులు: నాడు కేసీఆర్ ఏం చెప్పారంటే :సజ్జల..!!
న్యాయస్థానల్లో పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పని తీరుకు ఆటంకం కలిగిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు. ఓటుకు నోటు కేసు వెలుగుచూశాకే జగన్పై 30 కేసులు వేశారని సజ్జల తెలిపారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఎలా వేధించాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని ఆయన చెప్పారు.

టీడీపీ అధికారంలో ఉండగానే..
టీడీపీ అధికారంలో ఉండగానే నాడు దేవినేని, కోడెల, అచ్చెన్నపై ఉన్న కేసుల్ని కొట్టేసుకున్నారని సజ్జల వివరించారు. 2019 కోడ్ వచ్చేలోగా ఉన్న కేసుల్ని కొట్టివేయించుకున్నారని చెప్పారు. కక్ష సాధింపులో భాగంగా ఆనాడు జగన్పై కేసులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి జగన్కి వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పై పోరాడారని చెప్పారు. అప్పట్లో జగన్ మాట్లాడిన మాటలపైన టీడీపీ కేసులు పెట్టిందని గుర్తు చేసారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం కేసులు త్వరగా క్లోజ్ చేయాలన్నారు. విచారణ జరిపి కేసులు త్వరగా క్లోజ్ చేస్తే సుమోటోగా హైకోర్టు విచారణ చేస్తుందని వివరించారు.

ఏకతాటి పైకి వచ్చి కుట్రలు..
గతంలో జస్టిస్ రాకేష్ కుమార్ ఇలా చేస్తే సుప్రీం కోర్ట్ స్టే విధించిందని చెప్పారు. భయంకరమైన కేసులు జగన్ పై ఉన్నట్టు కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని తప్పు బట్టారు. కోర్ట్ లో లిస్ట్ సాయంత్రం వస్తే.... ఒక ఛానెల్ లో మధ్యాహ్నమే ఈ అంశం గురించి మాట్లాడారని వివరించారు. జగన్ పై ఒక సమన్వయం తో కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ..అనుకూల మీడియా విషప్రచారానికి అలవాటు పడ్డాయని, ఇందులో భాగంగానే పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు.

నాడు కేసీఆర్ చెప్పిందే...సత్సంబంధాలు కావాలి
పొరుగు రాష్ట్రాలతో తాము సత్సంబంధాలే కోరుకుంటున్నామని..అదే ముఖ్యమంత్రి విధానమని స్పష్టం చేసారు. గతంలో కేసీఆర్ చాలా ఔదార్యంతో రాయలసీమకు నీరు అందించేందుకు మద్దతు ఇస్తాం అన్నారని గుర్తు చేసారు. 40 కాదు అవసరమైతే 80 వేల క్యూసెక్ లు తీసుకోమని చెప్పారని వివరించారు. పూర్తిగా అంగీకరించి రెండడుగులు ముందుంటా అన్నారన్నారు. తాము ఒక్క చుక్క నీరు కూడా అదనంగా తీసుకోకుండా ముందుకు సాగుతున్నామని సజ్జల వివరించారు.

జగన్ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు..
ఎవరైనా నేతలు పరుషంగా మాట్లాడినా అది వారికే వదిలేస్తున్నామన్నారు. అటువంటి వ్యాఖ్యల పైన సీఎం లేదా పార్టీ నేతలు స్పందించరని చెప్పారు. పరుషమైన మాటలతో సమస్యలు పరిష్కారం కావని..రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు. వరద నీటిని ఒడిసి పట్టుకొనేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఒక్క నీటి చుక్క కూడా ఒప్పందాలకు వ్యతిరేకంగా వాడుకోవటం లేదని సజ్జల స్పష్టం చేసారు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల విషయంలో కట్టుబడి ఉండాలనేది జగన్ విధానమని..దానికే కట్టుబడి ఉన్నారని సజ్జల స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications