అమరావతికి భూములిచ్చిన రైతులకు.. మళ్లీ జాక్ పాట్
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం జాక్ పాట్ లాంటి వార్తను అందించింది.
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం జాక్ పాట్ లాంటి వార్తను అందించింది. 2017-18 బడ్జెట్ లో ప్రకటించిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు కాలావధిని కేంద్రం పెంచింది.
రెండేళ్లపాటు ఈ పన్ను మినహాయింపు ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా.. ప్లాట్లు పొందిన తరువాత రెండేళ్ల పాటు వర్తింపజేయాలని ఇది వరకే రైతులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై శుక్రవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. పన్ను మినహాయింపు మూడేళ్ల వరకు పొందే అవకాశముందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్ధ చట్టం-2014 నిబంధనల ప్రకారం రూపొందించిన భూ సమీకరణ పథకంలో పాల్గొని భూములు బదిలీ చేసిన అమరావతి ప్రాంత రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తూ 2017 ఆర్థిక బిల్లు క్లాజ్ 6లో ఉపశమనం కల్పించినట్లు పేర్కొన్నారు.
భూ సమీకరణ పథకం కింద భూమి లేదా భవనం లేదా రెండింటినీ బదిలీ చేసిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే భూ సమీకరణ పథకం కింద తమ భూములు ఇచ్చి.. వాటి కింద పొందిన భూ సమీకరణ యాజమాన్య పత్రాలు(ఎల్పీఓసీ)లను అమ్ముకున్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఈ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ప్లాటు లేదా భూమిని పొందిన ఆర్థిక సంవత్సరాంతం తరువాత రెండేళ్ల లోపు వాటిని అమ్ముకున్నప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.
అంటే.. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులు భూములు పొందగలిగితే ఆ ఏడాదితో పాటు తరువాతి రెండేళ్లు.. అంటే మొత్తంగా మూడేళ్లపాటు పన్ను మినహాయింపు సౌలభ్యాన్ని రైతులు వినియోగించుకోవచ్చు.