ఫ్లాష్ బ్యాక్ రిపీట్.. మంత్రి పల్లెకు మళ్లీ అవమానం
అనంతపురం : గతేడాది జరిగిన వ్యవహారమే ఈ ఏడాది జరిగింది. అప్పుడు తప్పిదం అని సరిపెట్టుకుంటే, వరుసగా రెండో ఏడాది కూడా అదే తప్పిదం జరగడంతో.. యాథృచ్చికమేనా..? లేక ఉద్దేశపూర్వకంగా మంత్రి పల్లెను అవమానిస్తున్నారా అన్న అనుమానాలు అనంతపురం పాలిటిక్స్ లో తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, పంపిణీ బ్యాగులపై సంబంధిత మంత్రుల ముఖచిత్రాలు ముద్రించడం కామన్ గా జరుగుతున్నదే. అయితే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మైనారిటీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నా..! ముస్లింల పండుగైన రంజాన్ సందర్భంగా పంపిణీ చేసిన తోఫా బ్యాగులపై ఆయన ఫోటో లేదు.
కాగా, జిల్లాకే చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫోటో మాత్రం రంజాన్ తోఫా పంపిణీ బ్యాగులపై ఉండడం, మంత్రి పల్లె ఫోటో మాత్రం లేకపోవడంతో ఆయనతో పాటు ఆయన ఆనుచరుల్లోను తీవ్ర అసంత్రుప్తిని రాజేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో మంత్రి పరిటాల సునీత ఫోటోను మాత్రమే బ్యాగులపై ముద్రించిన అధికారులు, మంత్రి పల్లెను విస్మరించారు.

నిజానికి రంజాన్ తోఫా బ్యాగుల పంపిణీ అటు పౌర సరఫరాల శాఖ, ఇటు మైనారిటీ శాఖల రెండింటి సమన్వయంతో జరగాలి. కానీ పదే పదే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు చూస్తోంటే రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడినట్టే కనిపిస్తోంది. ఇకపోతే ఆయా పథకాలకు సంబంధించి, సంబంధిత మంత్రుల ఫోటోలను ముద్రించడంలో సమాచార శాఖ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఏదైమైనా అధికారుల చర్యలు ప్రోటోకాల్ ను ఉల్లంఘించడమేనని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొంతమంది పార్టీ నేతలు మాత్రం మంత్రి పల్లెకు ఎదురవుతోన్న అవమానాన్ని సీఎం దగ్గర ప్రస్తావించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అయినా ఈ తప్పిదాల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుందో లేక అధికారులు మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications