చంద్రబాబు డబ్బులు అడిగారంటే మీరేలా నమ్మారా బాబు..!
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో, దాన్ని ఉపయోగించి మోసాలు చేసే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. తాజాగా, కృత్రిమ మేధ (AI) సహాయంతో తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , ఆ పార్టీ నాయకులు దేవినేని ఉమ ముఖాలను ఉపయోగించి నకిలీ వీడియో కాల్స్ చేసి, తెలంగాణ టీడీపీ నాయకులను ఘరానా మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.ఈ హైటెక్ మోసాన్ని నిజమని నమ్మి ఏకంగా 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మొదలైంది. ఒక దుండగుడు తొలుత కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేశాడు. కాసేపట్లో సార్ వీడియో కాల్ చేస్తారని నమ్మబలికాడు. చెప్పినట్టుగానే, కాసేపటికి దేవినేని ఉమ ముఖంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, వెంటనే మూడు వేర్వేరు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని కోరాడు. దీంతో, ఆ టీడీపీ నాయకుడు అది నిజమని నమ్మి ఏకంగా రూ. 35 వేలు పంపించాడు.

మరికొన్ని రోజులకు, ఆ దుండగుడు మళ్లీ ఫోన్ చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని ఆశ చూపాడు. దీనిపై మాట్లాడేందుకు కాసేపట్లో చంద్రబాబు స్వయంగా వీడియో కాల్ చేస్తారని చెప్పాడు.చెప్పినట్టుగానే, కాసేపటికి చంద్రబాబు ముఖంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో, ఆ నాయకులు అది నిజమని పూర్తిగా నమ్మారు.కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి, వెంటనే విజయవాడకు వస్తే చంద్రబాబును కలిసి, బీ ఫామ్ ఇప్పిస్తానని చెప్పడంతో, ఆశతో 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు విజయవాడకు బయలుదేరారు.
విజయవాడకు చేరుకున్న నాయకులకు దుండగుడు ఒక హోటల్ అడ్రస్ ఇచ్చి, హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పాడు. నాయకులు హోటల్లో బస చేసేందుకు వెళ్లారు.సాయంత్రం తిరిగి ఫోన్ చేసిన దుండగులు, చంద్రబాబును కలిసేందుకు కేవలం 8 మందికి మాత్రమే అనుమతి ఉంది, ఒక్కొక్కరు అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో, ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.పోలీసులు నేరుగా దేవినేని ఉమకు ఫోన్ చేయగా, తాను ఎవరికీ ఫోన్ చేయలేదని ఆయన స్పష్టం చేయడంతో, టీడీపీ నాయకులు తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు.
పోలీసులు దర్యాప్తు చేసి, మోసం చేసింది ఏలూరుకు చెందిన ఒక యువకుడిగా గుర్తించారు. అయితే, ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరువే పోతుందని భావించిన తెలంగాణ టీడీపీ నాయకులు, సైలెంట్గా వెనుదిరిగి రావడం గమనార్హం. AI టెక్నాలజీ (డీప్ఫేక్) ఎంతటి ప్రమాదకరమైన మోసాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక తాజా ఉదాహరణ.












Click it and Unblock the Notifications