బాబు అబద్దం: రామచంద్రయ్య, శైలజానాథ్ హెచ్చరిక
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీకి ఆర్బీఐ ఒప్పుకోకముందే టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి సీ రామచంద్రయ్య అన్నారు.
ఆర్బీఐ నిజంగానే మాఫీకి ఒప్పుకుంటే.. ఎంతమందికి, ఎప్పుడు, ఎవరెవరికి రుణాలు మాఫీ చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ వైపు హామీలను నెరవేర్చకుండా, మరోవైపు ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం టీడీపీకి సరికాదన్నారు.
ఎయిమ్స్ అనంతపురంకు: శైలజానాథ్
ఎయిమ్స్ను అనంతపురంలో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. కేంద్రం 13 సంస్థలను ఇస్తే వాటిని కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అనంతపురంను ఐటి హబ్గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరునూరైనా: పత్తిపాటి
రుణమాఫీ పైన ప్రతిపక్షాల విమర్శలు అవాస్తవమని మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా అన్నారు. ఆరునూరైనా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆర్బీఐ లేఖ కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. రుణమాఫీ విషయమై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు తెలియక పోవచ్చునని చెప్పారు.