ఎయిర్కోస్టాకు తప్పిన ముప్పు: రాజమండ్రిలో అగ్నిప్రమాదం, నిమిషాల్లో బాబు
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకి వెళుతున్న ఎయిర్కోస్టా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ కోస్టా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రెక్కల కింద ఉన్న గ్లాడర్(ఇంజన్)లో ఓ పక్షి ఇరుక్కుపోయింది. దీంతో ఇంజన్ తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
అప్రమత్తమైన విమాన పైలట్.. విమానాన్ని రన్వేపైనే నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో 42మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో విమానంలోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలో చాలా విమాన ప్రమాదాలు పక్షులు ఢీకొట్టడం వల్ల, ఇంజన్లలో ఇరుక్కుపోవడం వల్ల జరిగాయి.
షార్ట్
సర్క్యూట్తో
5
వాహనాలు
దగ్ధం
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. పుష్కరఘాట్ సమీపాన ఉన్న ఒక కూల్ డ్రింక్ షాపులో తొలుత ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు.
ఈ ప్రమాదంలో మూడు పోలీసు వాహనాలు, మరో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్ని కీలలు పెద్దవై పక్క షాపులకు వ్యాపిస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద శబ్దాలు రావడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ప్రమాద స్థలం గోకవరం బస్టాండ్కు చేరువలో ఉంది.
కాగా, ప్రమాద స్థలానికి సిఎం చంద్రబాబునాయుడు చేరుకుని పర్యవేక్షించారు. దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంఘటన జరిగిన ఐదు నిమిషాల్లో చర్యలు తీసుకున్నారని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడు నిమిషాల్లోనే ఫైరింజన్ వచ్చిందన్నారు. అందరు సహకరించాలని కోరారు. పదిహేనుమందికి గాయాలయ్యాయని తెలుస్తోంది.