అర్ధరాత్రి వైజాగ్ ఎయిర్పోర్ట్:విషవాయువులు వెలువడిన వేళ..విశాఖకు చేరిన స్పెషల్ ఫ్లైట్: కాస్సేపట్లో..
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా పారా టెరిటియరీ బ్యూటిల్ కెటెహాల్ (పీటీబీసీ) కెమికల్స్ను తెప్పించింది. 500 కేజీలతో పీటీబీసీ కెమికల్స్ విశాఖపట్నానికి చేరకున్నాయి. దీన్ని వినియోగించడానికి అవసరమైన ప్రత్యేక నిపుణులతో కూడిన ఎయిరిండియా స్పెషల్ కార్గో విమానం విశాఖకు చేరుకుంది.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకరమైన స్టెరిన్ గ్యాస్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడానికి వినియోంచే కెమికల్స్ ఇవి. గుజరాత్లోని వాపి పారిశ్రామికవాడలో తయారైన ఈ కెమికల్ గ్యాస్ లీకేజీ విస్తరించకుండా చేస్తుంది. దాని ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ పీటీబీసీ కెమికల్స్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో ఫోన్లో మాట్లాడారు. ఈ కెమికల్స్ను విశాఖకు సరఫరా చేయాలని విజ్ఙప్తి చేశారు.

విజయ్ రుపాని ఆదేశాల మేరకు వాపి పారిశ్రామికవాడలో గల రసాయన పరిశ్రమల నుంచి 500 కేజీల పీటీబీసీ కెమికల్స్ను రోడ్డు మార్గంలో దమన్కు తరలించారు. దమన్ నుంచి ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక కార్గో విమానంలో ఈ రసాయనాన్ని విశాఖపట్నానికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఫ్లయిట్ విశాఖపట్నానికి చేరుకుంది. కాస్సేపట్లో దీన్ని విష వాయువుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వాటిని వెదజల్లుతారు. ఎలాంటి విష వాయువుల తీవ్రతనైనా చెప్పుకోదగ్గ స్థాయిలో నియంత్రించగల సామర్థ్యం ఈ పీటీబీసీ కెమికల్స్కు ఉందని తెలుస్తోంది. అందువల్లే గుజరాత్ నుంచి వాటిని 500 కేజీల మేర తెప్పించుకుంది ప్రభుత్వం.













Click it and Unblock the Notifications