ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం: సీఎం జగన్ కీలక సమీక్ష, ఆదేశాలు
అమరావతి: ప్రతి జిల్లాకు ఒఖ విమానాశ్రయం ఉండాలనే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గురువారం పోర్టులు, ఎయిర్పోర్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కాగా, అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం నిర్దేశించారు. బోయింగ్ విమానాలు కూడా ల్యాండింగ్ అయ్యేలా రన్ వే అభివృద్ధి చేయాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతోపాటు రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్.
మరోవైపు, సముద్ర పోర్టులపైనా అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అంత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. భావనపాడు, రాయాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
తొలి దశలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో చేపడుతున్న ఐదు హార్బర్ల నిర్మాణం నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.