తస్సాదియ్యా.. షాపులు తగ్గినా మద్యం విక్రయాల జోరు మాత్రం తగ్గలేదు..! ఏపి తాగుబోతులా మాజాకా..?
అమరావతి/హైదరాబాద్ : మద్యం షాపులు క్రమంగా తగ్గిస్తూ రాష్ట్రంలో పూర్తి మద్య పాన నిషేదాన్ని అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వ విధానాలకు మద్యం ప్రియులు సహరించేట్టు కనిపించడం లేదు. ఏపిలో మద్యం షాపులను తగ్గించినప్పటికి మద్యం అమ్మకాల్లో ఎలాంటి మార్పులు రాకపోగా కొనుగోళ్లు పెరగడం ఎక్సైజ్ శాఖ అదికారులను ఆశ్చర్యానికి గురి చేసాయి. ఆంద్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ పరిణామలకు అదికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక షాపులు పూర్తిగా ఎత్తేసి మద్యం పాన నిషేదాన్ని అమలులోకి తెస్తే ఏపి లోని మద్యం ప్రియుల పరిస్థితి ఏంటని అదికారులు గుసగుసలాడుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది.
షాపులు తగ్గించినా తాగుబోతులు తగ్గలేదు..! ఏపీలో రెట్టింపైన మద్యం అమ్మకాలు..!
రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో భాగంగా దుకాణాల సంఖ్య తగ్గిస్తే, అమ్మకాలు భారీగా పడిపోతాయన్నది ప్రభుత్వం అంచనాకు విరుద్ద ఫలితాలు వస్తున్నాయి. షాపుల సంఖ్య తగ్గినా, విక్రయాలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. రివర్స్లో రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే లైసెన్సీలు రెన్యువల్ చేయించుకోకపోవడంతో దాదాపు 700కు పైగా దుకాణాలు మూతపడ్డాయి. అయితే అమ్మకాల విషయంలో ఎక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు. అంటే మద్యం అమ్మకాలకు షాపుల సంఖ్యతో సంబంధం లేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్నిబట్టి అక్టోబరు నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల పాలసీలో షాపుల సంఖ్య తగ్గించినా అమ్మకాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నూతన పాలసీలో 20% షాపులు తగ్గించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానివల్ల ప్రయోజనం ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారుతుండగా, 50శాతానికి పైగా షాపులు మూతపడితే గానీ ఆ ప్రభావం కనిపించదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
Recommended Video
5% పెరిగిన మద్యం విక్రయాలు..! అమ్మకాల విలువలో 15% వృద్ధి..!!
2018 జూలై నెలలో 1 నుంచి 27 వరకు 47,88,102 కేసుల మద్యం అమ్ముడైంది. ఈ ఏడాది జూలైలో 1 నుంచి 27 వరకు 5,03,906 కేసులు విక్రయాలు జరిగాయి. అంటే గతేడాది కంటే ఇది 5.09% ఎక్కువ. బీర్లలో ఏకంగా 25.99 వృద్ధి కనిపించింది. 2018 జూలైలో 1837721 కేసుల బీర్లు, ఈ జూలైలో 2315412 కేసులు అమ్మారు. లిక్కర్ మాత్రం, గతేడాది జూలైలో 2950381 కేసులు, ఈ ఏడాది జూలైలో 2716494 కేసులు మా త్రమే అమ్మారు. అంటే, 8.6% అమ్మకాలు తగ్గాయి. మొత్తంగా అమ్మకాల విలువను చూస్తే.. గతేడాది జూలైలో 1453కోట్ల రూపాయలు అయితే, ఈ జూలైలో 1670 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే విలువలో 14.93% వృద్ధి నమోదైంది.
షాపులు తగ్గినా..! ఎప్పుడైనా ఎక్కడైనా తాగుడే..!
రాష్ట్రంలో మొత్తం 4380 మద్యం షాపులున్నాయి. 2017-19 మద్యం పాలసీ జూన్ నెలాఖరుతో ముగియడంతో పాలసీని మూడు నెలలు పొడిగించారు. అయితే ఈ మూడు నెలల షాపుల నిర్వహణ వల్ల లాభాలేమీ ఉండవని భావించి, సుమారు 700 మంది లైసెన్సీలు రెన్యువల్కు ముందుకు రాలేదు. ఆ షాపులు మూతపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం కఠిన చర్యలతో బెల్టు షాపులు చాలావరకు బంద్ అయ్యాయి. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కొత్త పాలసీలో దాదాపు ఇంతేస్థాయిలో (20%)షాపులకు కోత పడుతుంది కనుక.. మద్యం నిషేధంలో ఇది తొలి అడుగులా పనిచేస్తుందని అంచనా వేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం నిజంగా అమ్మకాలు తగ్గాలని కోరుకుంటే, ఉత్పత్తినే నియంత్రించాలని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేయకుండా చర్యలు చేపట్టాలని కొందరు సూచిస్తున్నారు. రెండేళ్లలో 40శాతం మద్యం షాపుల సంఖ్య తగ్గించినా విక్రయాలు తగ్గే అవకాశం లేదంటున్నారు. షాపు ఎంతదూరంలో ఉన్నా తాగేవారు తాగుతారే తప్ప మానే పరిస్థితి ఉండదంటున్నారు.
గతేడాదితో పోలిస్తే పెరిగిన అమ్మకాలు..! పూర్తి నిషేదం విధిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులే..!!
మరోవైపు షాపుల సంఖ్య తగ్గించడం వల్ల నాటుసారా పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో నాటుసారా విస్తృతంగా ఉత్పత్తి అవుతోంది. మద్యం షాపులు అందుబాటులో లేనిచోట సారా స్థావరాలు వెలుస్తున్నాయి. సుదూరంలో ఉన్న షాపులకు వెళ్లలేని మందుబాబులు సారా వైపు మొగ్గుతున్నారు. రేపు ప్రభుత్వం శాశ్వతంగా షాపుల సంఖ్య తగ్గించినా ఇలాగే సారా పెరుగుతుందని, అప్పుడు ఎక్సైజ్ శాఖకు ఇప్పుడు ఉన్నదానికంటే పని పెరుగుతుందని అంటున్నారు. మద్యం షాపులు పూర్తిగా తొలగిస్తేనే నాటుసారాపైనే దృష్టి పెట్టొచ్చని, ఇటు షాపులు, అటు సారా నియంత్రణ అంటే కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.