గుంటూరుకు పరిశీలన: బాబుతో అలీ, తూర్పుపై ఆసక్తి
హైదరాబాద్/కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ గురువారం కలిశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి అలీ పేరును పార్టీ పరిశీలిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో అలీ టిడిపి అధినేతను కలవడం గమనార్హం. అలీ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోటీ చేయటానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన బాబు చెవిలో వేసి ఉంటారని అంటున్నారు.
కాగా, ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని, అయితే ఎక్కడి నుంచి, దేనికి పోటీ చేసేది పార్టీలో, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి ప్రకటిస్తానని టిడిపి నేత, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గురువారం తెలిపారు.
లెజెండ్ సినిమా విజయోత్సవం సందర్భంగా కడపలోని పెద్ద దర్గా, తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు కడపలో లెజెండ్ ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రసంగించారు. తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. ఎప్పటికీ ఎన్టీఆర్ ఒక్కరే లెజెండ్ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
అనంతరం ఆయన విశ్రాంతి తీసుకున్న రాజీవ్ స్మృతి వనంలో పని చేస్తున్న హరిప్రసాద్, కుమారి అనే దంపతుల బిడ్డకు బాలకృష్ణ హరిత అని నామకరణం చేశారు. లెజెండ్ చిత్రంలో స్త్రీమూర్తిపై చిత్రించిన వివిధ సన్నివేశాలు స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకేనని బాలకృష్ణ అన్నారు.