వచ్చే ఆరువారాల్లో ఏపీలో ఏం జరగబోతోంది ? కోడ్ లేకున్నా అన్నీ ఈసీ చేతుల్లోనే...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరును ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల కోడ్ మాత్రం ఎత్తేయాలని సూచించింది. అదే సమయంలో వచ్చే ఆరు వారాల పాటు ప్రభుత్వం ఈసీ అనుమతితోనే కొత్తగా చేపట్టే పథకాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సీఎం జగన్ వర్సెస్ ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ గా పరిస్ధితులు మారిన నేఫథ్యంలో ఈ ఆరు వారాల్లో ఈసీ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి రేగుతోంది.

ఏపీలో స్ధానిక పోరు వాయిదా.. కానీ..
ఏపీలో స్ధానిక ఎన్నికలను కరోనా నేపథ్యంలో ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ సమర్ధించింది. ఈ ఆరువారాల్లో కోడ్ కూడా వర్తించదని స్పష్టం చేసింది. కానీ అక్కడే ఓ మెలిక పెట్టింది. కోడ్ లేదంటూనే ఆరువారాల్లో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించాలన్నా, కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని తీర్పులో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఈ ఆరునెలల్లో జరగాల్సిన పలు కార్యక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముద్ర తప్పనిసరిగా మారింది.

జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్ నేపథ్యంలో..
వాస్తవానికి కరోనా ప్రభావం పేరుతో ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదా విషయంలో కానీ, దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన విషయంలోనూ ఎలాంటి వివాదం ఉండేది కాదు. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి అస్పష్టత కూడా లేదు. కానీ అంతకంటే ముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఏకంగా కులం కోణం తీసుకొచ్చి మరీ సీఎం జగన్ తప్పుబట్టిన నేపథ్యంలో తాజా పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఆరు వారాల్లో ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన పథకాల ప్రక్రియ కొనసాగనుండగా, కొత్తగా పథకాల ప్రకటనలకు మాత్రం బ్రేక్ పడబోతోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటికే కొనసాగుతున్న పేదలకు ఉగాది ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందుకు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే అంతకు మించి ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఈసీ నిశితంగా పరిశీలించే అవకాశముంది.

జగన్ వైఖరిపై ఆగ్రహంగా నిమ్మగడ్డ...
స్ధానిక ఎన్నికల పోరు వాయిదాకు కరోనా వైరస్ ప్రభావాన్ని కారణంగా చూపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏకంగా తాను చంద్రబాబు మనిషని పేర్కొంటూ కులం కోణంలో సీఎం స్ధాయిలో ఉన్న జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కు తీవ్ర ఆగ్రహం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఆయన రాసిన లేఖలను బట్టి అర్దమవుతోంది. ఓ దశలో ఆయన జగన్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా సిద్ధమైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి పిటిషన్ మాత్రం వేయలేదు.
Recommended Video

ఆరువారాల్లో నిర్ణయాలపై ప్రభావం..
స్ధానిక ఎన్నికల పోరు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్.. రాబోయే ఆరు వారాల్లో ఎలా వ్యవహరిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టు పెట్టిన మెలికతో రాబోయే ఆరువారాల్లో వైసీపీ సర్కారు తీసుకునే కీలక నిర్ణయాలకు నిమ్మగడ్డ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కటి ఉన్నా వాటికి ఈసీ నుంచి అభ్యంతరాలు తప్పకపోవచ్చు. అదే జరిగితే వాటి విషయంలో వైసీపీ సర్కారు మరోసారి ఈసీతో ఘర్షణకు సిద్ధమవుతుందా లేక నిబంధనలను అంగీకరించి సర్దుకుపోతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications