సీఎం జగన్ కుప్పం పర్యటన 23నే ఎందుకు - తొలి అడుగు : చంద్రబాబుకు ఆహ్వానం..!!
ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. ఈ నెల 22న జరగాల్సిన పర్యటన 23వ తేదీకి వాయిదా పడింది. దీని వెనుక వైసీపీ నేతలు చెబుతున్న లెక్కలు ఆసక్తి కరంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. పార్టీ నేతలు ఇదే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నారు. అందులో కుప్పంలో ఎందుకు గెలవలేమంటూ సీఎం పదే పదే ప్రశ్నిస్తున్నారు.

కుప్పం నుంచే తొలి అడుగు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో అనూహ్యంగా వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కుప్పం అభ్యర్ధిగా ఎమ్మెల్సీ భరత్ ను సీఎం ఖరారు చేసారు. భరత్ ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ఇదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు 14 ఏళ్లు పని చేసినా కుప్పం రెవిన్యూ డివిజన్ చేయలేకపోయారంటూ పలు సందర్భాల్లో సీఎం ఎద్దేవా చేసారు.
కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలంటూ తనకు చంద్రబాబు లేఖ రాసారని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజన..కొత్త రెవిన్యూ డివిజన్లలో భాగంగా కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ఖరారు చేసారు. ఇక, కుప్పం అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్ రూ 66 కోట్లను మంజారు చేసారు.

23వ తేదీ ఎంపిక వెనుక
ఈ పర్యటనలో భాగంగా వైయస్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధుల విడుదలతో పాటుగా, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలోనూ పాల్గొంటారు. అయితే, 23వ తేదీకి జగన్ కు ఉన్న సంబంధాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను.. ముగ్గురు ఎంపీలను టీడీపీ తన పార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించింది.
అయితే, 2019 ఎన్నికల్లో ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. ఆ ఫలితాల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. కాగా, ప్రతిపక్ష టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. అదే విధంగా ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య..2019 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు - ఎంపీల సంఖ్య ఒకటే కావటం దేవుడి స్క్రిప్టుగా సీఎం జగన్ పలు సందర్బాల్లో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇలాకా నుంచే ప్రకటన
ఇప్పుడు కుప్పంలో పర్యటన తేదీ కూడా అదే రోజుగా ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలనేది సీఎం జగన్ లక్ష్యం. మంత్రి పెద్దిరెడ్డికి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి.
ఇక, ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో కుప్పంలో పాల్గొంటున్న వేళ..ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక అధికారుల నుంచి తెలుస్తోంది. కానీ, ఈ కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం కనిపించటం లేదు.
కుప్పం పైన జగన్ ఫోకస్ చేసిన సమయంలో, చంద్రబాబు తాము కుప్పంలోనే కాదు..పులివెందులలోనే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ కుప్పం వేదికగా ఎటువంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications