చిరంజీవి vs బ్రాహ్మణ సంఘాలు.. గరికపాటి వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం
ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు నటుడు చిరంజీవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. కార్యక్రమం తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించి ట్వీట్ చేయడం.. లాంటి సంఘటనలన్నీ వరుసగా జరిగాయి. తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కౌంటర్ ఇచ్చింది. ''ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందారనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే.. చిడతలు కొట్టే వాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా?'' అంటూ పేరు ప్రాస్తావించకుండానే ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన పేరు ప్రస్తావించకుండా ''ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనన్నారు''. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ స్పందించి పైవిదంగా ట్వీట్ చేసింది. అంతేకాకుండా 'అలయ్ బలయ్' పై చిరంజీవి అభిమానులు కూడా స్పందిస్తున్నారు. గరికపాటి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రవచనాలు అడ్డుకుంటామంటూ చిరంజీవి యువత ప్రకటించింది.