"ఆచార్య" చుట్టూ ఏపీ రాజకీయం : చిక్కుతారా..చిక్కుల్లో పెడతారా : మెగా క్యాంపు స్ట్రాటజీ పక్కా..!!
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో...పొలిటికల్ సర్కిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్ గా మారారు. అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల వేడి పెరుగుతోంది. గ్రూపులు..వర్గాలు..ఎత్తులు..పై ఎత్తులు నడుమ రాజకీయ పార్టీలను మించిన ప్లాన్ లు నడుస్తున్నాయి. తెర వెనుక చిరంజీవి మద్దతు ఉందని..తమ విజయం ఖాయమని ఒక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వర్గాలు..ప్రాంతీయ వాదాలతో చిరంజీవి లాంటి వారు ఖచ్చితంగా పరిస్థితిని చక్కదిద్దుతారంటూ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ లాంటి వారు నిరీక్షిస్తున్నారు.
రాజకీయంగా ఉత్సుకత..
అటు చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. చిరంజీవి కాంగ్రెస్ లో లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఎప్పడూ చిరంజీవి తాను కాంగ్రెస్ ను వీడినట్లుగా ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. దీంతో..పీసీసీ అధ్యక్షుడు శైలజా నాద్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తనతో పాటుగా ఏఐసీసీ కార్యదర్శులు ఇద్దరి పేర్లతో కలిపి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఉమెన్ చాందీ చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. చిరంజీవి తన కిష్టమైన సినిమా రంగంలో బిజీగా ఉన్నారని..సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని చెప్పుకొచ్చారు. అయితే, దీనికి కొనసాగింపుగా చిరంజీవి కుటుంబం తొలి నుండి కాంగ్రెస్ తోనే ఉందని పేర్కొన్నారు. దీని పైన ఇప్పుడు భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ తో బలమైన బంధం..
ప్రజారాజ్యం విలీనం తరువాతనే చిరంజీవి కాంగ్రెస్ తో కలిసారు. కుటుంబంలోని పవన్ ఏనాడు కాంగ్రెస్ తో లేరు. అయినా..మెగా క్యాంపు నుండి ఈ వ్యాఖ్యల పైన స్పందన రాలేదు. ఇదే సమయంలో..ఏపీలో జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయనకు మద్దతుగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో సహా..అనేక అంశాల్లో చిరంజీవి ఆయనకు బాసటగా నిలిచారు. ఒక్క విమర్శకు సిద్దపడలేదు. అదే విధంగా చిరంజీవి సినీ పెద్దలతో కలిసి తన ముందు ఉంచిన సినీ పరిశ్రమ సమస్యలను సీఎం సైతం వెంటనే పరిష్కరించారు. దీంతో..సీఎం జగన్ - చిరంజీవి మధ్య మరింత బంధం పెరిగింది. తమ్ముడు పవన్ నాయకత్వంలో ఉన్న జనసేనకు చిరంజీవి మద్దతు ఉందని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. కానీ, చిరంజీవి తన తమ్ముడి పార్టీకి మద్దతుగా ..వ్యతిరేకంగా ఏ రోజు వ్యాఖ్యలు చేయలేదు.
ఓడినా..తగ్గని ఛరిష్మా..
రాజకీయంగా తొలి సారి ప్రజారాజ్యం పేరుతో ప్రజల్లోకి వచ్చిన సమయంలోనే 2009 ఎన్నికల్లో చిరంజీవి 15.6 శాతం ఓట్లు అంటే దాదాపుగా 80 లక్షల ఓట్లు సాధించారు. 18 సీట్లు గెలుచుకున్నారు. నాటి ఎదురుదెబ్బలకు తట్టుకొని నిలబడి ఉండే..2014 నాటి పరిణామాల నేపథ్యంలో చిరంజీవి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవారని విశ్లేషకులు అందరూ చెబుతున్న మాట. అయితే, చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతున్నా...2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతం కంటే సామాజిక కార్యక్రమాలు...సినీ ఇండస్ట్రీ వ్యవహారాలు..ఏపీలో ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఇవన్నీ చిరంజీవి పొలిటికల్ వ్యూహంలో భాగమేననేది వారి విశ్లేషణ.
మెగాస్టార్ మౌనం..వ్యూహాత్మకమేనా..
అందులో భాగంగానే...చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారన్నా...వైసీపీ నుండి రాజ్యసభ అని ప్రచారం సాగినా..జనసేనకు మద్దతు ఉందని చెప్పినా.. ఏరకంగానూ స్పందించలేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అడుగులు..బీజేపీతో పొత్తు..రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అంచనాకు వచ్చిన తరువాత మాత్రమే చిరంజీవి ఏపి రాజకీయాల్లో తన వైఖరి పైన స్పష్టత ఇస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తొలి అడుగు విఫలమైనా...ఇప్పుడు అందులోనూ సక్సెస్ అయి తన సత్తా చాటుతారంటూ కొందరు ఔత్సాహికులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. మరి...సినీ పరిశ్రమకు "ఆచార్య" గా నిలుస్తున్న చిరంజీవి..రాజకీయాల్లో తన వైఖరి..విధానం..అడుగుల పైన ఏ రకమైన స్పష్టత ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. మెగా ఫ్యాన్స్ లో ఉత్సుకత పెంచుతోంది.