అధికారంలోకి రావాలంటే ఈ 34 నియోజకవర్గాలే కీలకం!!
ఉభయ గోదావరి జిల్లాలపై రాజకీయ పార్టీలకు చెందిన నేతల కన్ను పడింది. మొదటి నుంచి రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఈ రెండు జిల్లాల్లో పట్టు నిలుపుకుంటే అధికారం దక్కుతుందనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జల జల పారే గోదావరిలా తమ పార్టీకి ఓట్లు రావాలంటే.. తమ పార్టీకి రావాలంటూ అన్ని పార్టీల నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటినుంచే ఒక ప్రణాళిక ప్రకారం పర్యటనల పేరుతో ఆ జిల్లాలపై దండెత్తుతున్నారు. తమ పట్టు నిరూపించుకోవడానికి, ఉన్న పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడి ప్రజలు ఎటువైపు మొగ్గితే అటువైపే..
ఈ రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలున్నాయి. గోదావరి ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సెంటిమెంట్ ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ రెండు జిల్లాలపై దృష్టిసారిస్తుంటాయి. గత ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొని అధికారం చేపట్టింది. అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది ఇదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాపు సామాజికవర్గ ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎలాగైనా గోదావరి జిల్లాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని, కింగ్ మేకర్ గా అవతరించాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు.

పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు.. ఆ తర్వాత జగన్
పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ రెండు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర తాజాగా జరిపారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు తన వ్యక్తిగత సొమ్ము నుంచి నష్టపరిహారాన్ని అందజేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఆయనకు మంచి స్పందన లభించింది. ఇక్కడి ప్రజలు తలుచుకుంటే తాను ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు.
రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి లేదంటే భీమవరం నుంచి పోటీచేయాలని జనసేనాని యోచిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెండురోజులపాటు ఈ రెండు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. గోదావరి వరదలవల్ల నిరాశ్రయులైనవారిని ఆయన కలిసి పార్టీపరంగా ఆర్థిక సహాయం చేయబోతున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు అన్నారు.

త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా..
ఇప్పటికే అధికార పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లా నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో సాధించిన విజయాలనే ఈసారి కూడా పునరావృతం చేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ఏతావతా చూస్తే ఈ రెండు జిల్లాల్లో పట్టు పెంచుకొని అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దీనికి కారణం.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటమేనంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి గోదావరి ప్రజలు పట్టం కడతారో? ఏ పార్టీకి అధికారం దక్కుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications