సోనియా టీ పక్షపాతి కాదు, వారిదే బాధ్యత: డిఎస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిగిన తర్వాతే రాష్ట్ర విభజన జరిగిందని మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా మంగళవారం ఆయన గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలదే బాధ్యత అని ఆయన అన్నారు.
యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ పక్షపాతి అనడం సరైనది కాదని ఆయన అన్నారు అభిప్రాయపడ్డారు. సోనియా దృష్టిలో దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమే చెప్పారు. తమతో సంప్రదింపులు జరపకుండా రాష్ట్రంపై నిర్ణయం తీసుకుందని కొన్ని పార్టీలు పేర్కొనడం భావ్యం కాదని డిఎస్ అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమలో పాల్గొన్న జూపల్లి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని, లేకుంటే యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తెలంగాణకు సీమాంద్రులు అడ్డుకుంటే తుపాకులతో పోరాడైనా సాధించుకుంటామని తెరాస నేత్ వినోద్ అన్నారు. కాంగ్రెస్ విభజన నిర్ణయంలో ఎలాంటి మార్పు వున్నా మళ్లీ ఉద్యమం తప్పదని ఆయన వరంగరల్లో హెచ్చరించారు.
తెలంగాణకు సెప్టెంబర్ 17 అసలైన స్వాతంత్య్ర దినం అని బిజెపి నేత నాగం జనార్దన్రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు సీమాంధ్ర మంత్రులకు తొత్తుగా మారారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణను అడ్డుకుంటే సహించేది లేదని నాగం హెచ్చరించారు.