కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం! తిరుమంజనం ఆరంభం
కడప: జిల్లాలోని ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 13వ తేదీన స్వామి వారి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇదివరకే విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమంజనం వైభవోపేతం..
సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. స్వామి వారి గర్భాలయం, ఆంజనేయస్వామి, గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు.
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శనివారం వృషభలగ్నంలో ధ్వజారోహణంతో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఆరంభం అవుతాయి. అదే రోజు సాయంత్రం పోతన జయంతి నిర్వహిస్తారు. 16న హనుమంత వాహనం, 18న సీతారాముల కల్యాణం, 19న రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 21న చక్రస్నానం, ఏప్రిల్ 22న పుష్పయాగం కార్యక్రమాలను చేపడతారు. కోదండరాముడు-సీతమ్మ తల్లి స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసే భక్తుల కోసం ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్టలో తిరుమల లడ్డూల విక్రయం..
స్థానికుల కోరిక మేరకు శ్రీవారి లడ్డూలను ఒంటిమిట్టలో విక్రయించనున్నారు. మొదటి శనివారం 2 వేలు, నాలుగో శనివారం 2 వేల లడ్డూలు మొత్తం 4 వేల లడ్డూలను ప్రతి నెలా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమి పండుగ రోజున అన్ని ప్రముఖ ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించడం మనకు తెలుసు. ఒంటిమిట్టలో మాత్రం దీనికి భిన్నంగా చైత్రశుద్ధ పౌర్ణమి నాటి రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. 18న జరిగే కల్యాణానికి లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. కల్యాణవేదిక వద్ద ఒకేసారి లక్ష మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లను చేశారు.
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 13న- ధ్వజారోహణం, పోతన జయంతి, శేషవాహనం, 14న వేణుగాన అలంకారం, స్వామివారిని హంస వాహనంపై ఊరేగింపు, 15న వటపత్రసాయి అలంకారం, సింహ వాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. 16న నవనీత కృష్ణ అలంకారం, సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 17న మోహినీ అలంకారం, సాయంత్రం గరుడసేవను నిర్వహిస్తారు. 18న శివ ధనస్సు అలంకారం, అదే రోజు రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం గజవాహన సేవ ఉంటుంది. 19న రథోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. 20న కాళీయమర్ధన అలంకారం, అనంతరం అశ్వవాహన సేవ. 21న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుంది. 22వ తేదీన పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.