2024 ఎన్నికల్లో గెలుపెవరిది : పబ్లిక్ పల్స్ క్లియర్..!!
సెమీస్ గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది. పబ్లిక్ పల్స్ ఎం చెబుతోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు పైన అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీ ధీమాగా కనిపిస్తున్నాయి. ఫైనల్స్ సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీస్ గా భావిస్తున్నాయి. హోరా హోరీగా తల పడ్డాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఇందులో పట్టభద్రులు.. ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కీలకంగా భావిస్తున్నారు. దీంతో..నేడు వెలువడే ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

ఏపీలో 9 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు
ఏపీలో జరిగిన తొమ్మది ఎన్నికల స్థానాల కోసం 139 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. 3 గ్రాడుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేసింది. టీడీపీ పట్టభద్రుల నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీలతో పరస్పర అవగాహన కుదుర్చుకుంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..జనసేన తీరు చర్చకు దారి తీసింది. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి ఓటు వేయాలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఓట్ల లెక్కింపుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఫలితం ప్రకటన మాత్రం కోర్టు సూచనలకు లోబడి ఉండాలని సూచించింది.

పార్టీలకు ప్రతిష్ఠాత్మకం - హోరా హోరీగా
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ప్రజా తీర్పు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ ఫలితం ఎక్కువగా పబ్లిక్ పల్స్ కు అనుగుణంగా భావించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయుల మద్దతు ఎవరి వైపు అనేది తేలిపోనుంది. విశాఖ గ్రాడుయేట్ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

సెమీస్ విజేతలు ఎవరు.. ఫైనల్ పై అంచనాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు నిర్దేశిత కోటా చేరుకుంటే విజేతను ప్రకటిస్తారు. చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. ఇక..ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ఎన్నికల సంఘానికి లేఖలు రాసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపు బాధ్యతలను సీఎం జగన్ మంత్రులకు అప్పగించారు. ఉత్తరాంధ్రలో బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో రాయలసీమ గ్రాడ్యుయేట్స్ పోరు టీడీపీ - వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు..ఈ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన ఓట్ల ద్వారా పబ్లిక్ పల్స్ ఏంటనేది స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications