ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు - చిరంజీవి హాజరు : 9 వేల బస్సుల్లో జనసమీకరణ..!!
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. రేపు ( సోమవారం) ప్రధాని మోదీ భీమవరంలో పర్యటిస్తారు. ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గన్నవరం చేరుకుంటారు, అక్కడి నుంచి హెలికాప్టర్ లో భీమవరం రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషన్.. సీఎం జగన్ తో సహా మంత్రులు -అధికారులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
ప్రధానితో పాటుగా సీఎం సైతం హెలికాప్టర్ లోనే భీమవరం చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన కోసం భీమవరంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని భీమవరం వేదికగా నిర్వహించనున్నారు.
16 ఎకరాలు - లక్ష మంది జనం
ఇందు కోసం భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో.. 16 ఎకరాల్లో భారీ వేదిక ఏర్పాటు తుది దశకు చేరింది. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అక్కడే సభ ఏర్పాటు చేసారు. భారీ వర్షాల కారణంగా సభకు ఇబ్బందులు లేకుండా..అధికారులు చర్యలు ప్రారంభించారు. దాదాపు లక్ష మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల వరకు ఎల్ఈడీ స్క్రీన్లు సిద్దం చేసారు. ప్రధాని రాకపోకలకు వీలుగా నాలుగు హెలిప్యాడ్లు సిద్దం అయ్యాయి. ప్రధాని వేదికతో పాటుగా సమీపంలోనే మరో వేదిక సిద్దం చేసారు. ఆ వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
చిరంజీవి హాజరు ఖరారు
వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక, ప్రయివేటు సంస్థల నుంచి సేకరించిన మరో ఏడు వేల బస్సులను జన సమీకరణకు వినియోగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాలు..ప్రవాసాంధ్రులు సైతం తరలి వస్తారని ఉత్సవ కమిటీ చెబుతోంది.
ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి హాజరు ఖరారైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి సొంత జిల్లా కావటంత పాటుగా. .కేంద్రం నుంచి ఆహ్వానం అందటం.. అల్లూరి సీతారామ రాజు కార్యక్రమం కావటంతో ఆయన హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహణకు ఏర్పాట్లు
ఇక, ఈ సమయంలోనే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది. క్షత్రియ పరిషత్ నర్సీపట్నం సభ్యులు డీవీఎస్ రాజు అల్లూరి జిల్లా నడుంపాలెం లంకవీధి జీడితోటల్లో ఉంటున్న గంటం దొర మనువడు బోడి దొర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానించారు. వీరికి తమ వంతు సాయం అందించేందుకు సిద్దమయ్యారు. ఇక, ఈ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరింత ఆసక్తి ని పెంచుతోంది.