TTD: భక్తులకు ఇక 16 రకాల ప్రత్యేక వంటకాలు - రీఫిల్లింగ్ విధానంలో దర్శనం..!!
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. ఈ సారి బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుంది. అదే విధంగా రీఫిల్లింగ్ విధానంలో దర్శనం అమలు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో భక్తులకు వసతి కోసం కొత్త సముదాయం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సారి భక్తుల కోసం ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల వేళ 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుంది. వాహన సేవల కోసం మాడ వీధుల్లోని మూలల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35000 మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. మాడ వీధుల బయట ఉండేవారు వీక్షించేందుకు వీలుగా 36 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ బ్రేక్.. ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ పలు నిర్ణయాలను అమలు చేయనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులూ శ్రీవారి ఆలయంలో రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలు ఉపయోగించ నున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 229 కళాబృందాలను రప్పించారు. సాధారణ భక్తులకు సేవల కోసం 3,500 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు. కొండపైన ప్రతి 4 నిమిషాలకోసారి టీటీడీ, ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకూ అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు. రోజూ 8 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ప్రతి 100 మీటర్లకు ఒకటి చొప్పున 10 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అదే విధంగా రద్దీ ఎక్కువగా ఉండే వేళ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య విధులు పర్యవేక్షించే అధికారులు, పనిచేసే సిబ్బందిని అందులో మ్యాపింగ్ చేస్తారు. భక్తుల ఫీడ్బ్యాక్నూ దీని ద్వారా తెలుసుకుంటారు. భక్తులు వారి చెప్పులను కౌంటర్ల వద్ద అప్పగిస్తే క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్ను సిబ్బంది ఇస్తారు.
అందులో ఉన్న నంబరు ఆధారంగా భక్తులు తమ చెప్పులను మళ్లీ తీసుకోవచ్చు. పార్కింగ్ సమస్యలను కూడా తొలగించడానికి ఆస్ట్రేలియాలో విజయవంతమైన స్మార్ట్ పార్కింగ్ను బ్రహ్మోత్సవాల తర్వాత అమల్లోకి తీసుకురానున్నారు. రద్దీని అధిగమించేందుకు తిరుమలలోని మఠాల నుంచీ 60 శాతం గదులు తీసుకున్నారు. ఉభయ దేవేరులతో మలయప్పస్వామి వారు దాదాపు 16 వాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తూ లక్షల మంది భక్తులకు దర్శనమివ్వనున్నారు.












Click it and Unblock the Notifications