అందరి దృష్టి ఆంద్రా ఆక్టోపస్ పైసే.. వేడెక్కిన ఏపి రాజకీయం..! క్యాంపులకు రంగం సిద్ధం...!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఫలితాలు వెల్లడయ్యే రోజున ఏపీలో క్యాంప్ రాజకీయాలు మొదలవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలు పోటాపోటీగా జరిగినప్పుడు, రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్ల మధ్యన పెద్దగా తేడా లేనప్పుడు హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి లో క్యాంప్ రాజకీయాలు మొదలు కాబోతున్నాయి. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారకుండా చూసుకునేందుకు ఇలాంటి రాజకీయాలు ఎంతో అవసరం. గతంలో, ఇలా క్యాంపులు ఏర్పాటు చేసుకుని తమ నేతలను కాపాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఏపిలో పోటా పోటీ రాజకీయం..! కష్టంగా మారిన మెజారిటీ అంచనా..!!
ఏపీ ఓటర్లు ఎవరివైపు మొగ్గారన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. తమదే అధికారమని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలమైన సర్వేలను బయట పెడుతున్నారు. కౌంటింగ్ రోజున ఫలితాలను బట్టి క్యాంప్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని, ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కొందరు మంత్రులు ప్రస్తావించారు. ఇప్పుడిది టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ కూడా క్యాంప్ వ్యూహంపై కసరత్తు సాగిస్తోంది.
19న ఎగ్సిట్ పోల్స్..! రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠ..!!
దేశవ్యాప్తంగా చివరి విడత పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరగనుంది. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ (పోస్ట్) పోల్ ఫలితాల కోసం అన్ని పార్టీలు ఆశగా, ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. జాతీయ మీడియాలో వచ్చే ఎగ్జిట్ పోల్స్ అనేకసార్లు నిజమయ్యాయి. వాటి అంచనాల్లో కొన్నిసార్లు స్వల్పంగా, మరికొన్నిసార్లు భారీగా తేడా కనిపించింది. పూర్తిగా తిరగబడిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ, వాటిపై ప్రజలందరిలో విశ్వసనీయత మాత్రం తగ్గలేదు. తెలంగాణ ఎన్నికల్లోనూ జాతీయ మీడియా సర్వేలు నిజమయ్యాయి. ఆ సర్వేల ఫలితాలనుబట్టి క్యాంప్ రాజకీయాలు నిర్వహించాలా, వద్దా నిర్ణయించవచ్చని ఏపీలోని రెండు ప్రధాన పార్టీల నేతలు ఆలోచిస్తున్నారు.
లయ తప్పినా లగడపాటి మీదే గురి..! ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్..!!
ఎన్నికల సర్వే... అనగానే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి వెంటనే గుర్తుకొచ్చే పేరు.. లగడపాటి రాజగోపాల్. ఇంతకీ, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు...? తుది విడత ఎన్నికలు ముగియనున్న 19వ తేదీ సాయంత్రం సర్వే ఫలితాలను ప్రకటిస్తానన్నారుగా.... ఆ పనిలోనే ఉన్నారా...? రాజకీయాలపై, సర్వేలపై ఆసక్తిగల అందరిలోనూ వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. గతంలో లగడపాటి సర్వేలకు విశేష ఆదరణ ఉండేది. బెట్టింగ్ రాయుళ్లు కూడా, లగడపాటి సర్వే ఆధారంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టేవారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలో లగడపాటి సర్వే బొక్కబోర్లా పడింది. అయినప్పటికీ, ఆయన సర్వేపైస విశ్వసనీయత పెద్దగా తగ్గలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశీ గడ్డపై ఉంటున్న మన వాళ్లలోనూ కనిపిస్తోంది.
అమెరికాలో లగడపాటి..! అందరి ద్రుష్టిని ఆకర్శిస్తున్న ఘనాపాటి..!!
లగడపాటి, ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన గతంలో పలుమార్లు అమెరికా వెళ్లారు. కానీ, ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఆయన అక్కడ ‘సెలబ్రిటీ' అయిపోయారు...! ఈసారి ఆయనకు అక్కడి తెలుగువాళ్లు ఘనంగా స్వాగతం పలికారట. ఆయనకు ఆతిథ్యం ఇచ్చేందుకు పోటీ పడుతున్నారట. దీనికి కారణమేంటో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఆయనను కాకా పట్టి, మాటల్లో పెట్టి, ఏపీ ఫలితాల అంచనాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇదంతా ముందే గ్రహించిన లగడపాటి, ఏమాత్రం బయటపడకుండా గుంభనంగా ఉంటున్నారట. అలాగని, ఏమీ చెప్పకపోతే బాగుండదని అనుకున్నట్టున్నారు. చిన్న చిన్నగా లీకులు ఇస్తున్నారు. ‘అభివృద్ధికి, సంక్షేమానికి మద్దతుగా కొన్నిచోట్ల ఓటు వేశారు. కొన్నిచోట్ల టీడీపీ, మరికొన్నిచోట్ల వైసీపీ హవా సాగుతుంది. జనసేనకు అనూహ్యంగా ఓట్లు పడతాయి' అని చెబుతున్నారు. వీటి ఆధారంగా, ఆ ఎన్ఆర్ఐలు తమదైన విశ్లేషణలు, చర్చలు సాగిస్తున్నారు.