చంద్రబాబు దొంగ దీక్షలు .. తిని అరిగేదాకా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు : ఆళ్ళ నాని ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు . సాధన దీక్ష పేరుతో కరోనా బాధితులకు అండగా ఈరోజు దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా మహమ్మారిని జగన్ సీరియస్ గా తీసుకోలేదని, రాష్ట్రంలో కరోనా మరణాల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ పాలనపై నిప్పులు చెరిగారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాధన దీక్ష పేరుతో చంద్రబాబు నాయుడు హైడ్రామా చేశారని మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. ప్రజలకు అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పకుండా చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఇప్పుడు విమర్శిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. బాగా తిని దీక్షకు కూర్చున్న చంద్రబాబు తిన్నది అరిగే వరకు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడిన ఆళ్లనాని కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆక్షేపించారు.
చంద్రబాబు, లోకేష్ జూమ్ లో కాలక్షేపం చేస్తున్నారని, కానీ ప్రభుత్వం కరోనా పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరోనా నివారణ చర్యలు ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఆళ్ల నాని పేర్కొన్నారు. సీఎం జగన్ పై బురద జల్లడం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. ఇక పారాసిటమాల్ అనేది ఐసీఎంఆర్ ప్రోటోకాల్ లో ఉందని, చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదని ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. బ్లీచింగ్ పౌడర్ ను పారిశుద్ధ్యంలో భాగంగా వాడతారన్న జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదని ఆళ్ల నాని ఫైర్ అయ్యారు.