విద్యార్ధులకు కూటమి సర్కారు తీపికబురు.. త్వరలోనే అకౌంట్ల లోకి 15 వేలు
ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్ధులకు సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే మరో హామీని కూడా నిలబెట్టుకోనుందని తెలుస్తోంది.
తల్లికి వందనం.. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా దీన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15000 అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలందరికీ రూ. 15000 అందించడం జరుగుతుందని.. పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ ఈ రూ.15000 వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికి రూ. 15000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో విద్యార్ధులు చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుందని కూటమి పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications