అమరావతి గ్రామాల్లో కలకలం: పేదలకు ఇళ్ల స్థలాలుగా రాజధాని భూములు: 1251 ఎకరాల సేకరణ
అమరావతి: అమరావతి గ్రామాల్లో తాజా కలకలం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోని కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున భూమిని సేకరించడానికి జగన్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. మెనిఫెస్టోలో పొందుపరిచిన పేదలకు ఇళ్లు పథకం కింద భూమిని సేకరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి జే శ్యామలరావు నోటిఫికేషన్ను జారీ చేశారు.
జగన్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ: తప్పు పట్టిన క్యాట్: ఆ అధికారి సస్పెన్షన్ రద్దు
54 వేల మంది కోసం మొత్తం 1251 ఎకరాల సేకరణ..
సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు సొంత ఇంటి వసతిని కల్పించడానికి మొత్తం 1251.5065 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం 54,307 మందిని లబ్దిదారులుగా గుర్తించింది. వారందరికీ సొంతింటిని నిర్మించుకోవడానికి భూమిని సేకరించనుంది. ఇందులో అమరావతి నిర్మాణానికి ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం సమికరించిన భూములు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు తాజా కలకలానికి దారి తీస్తోంది.
Recommended Video
భూసేకరణ జరిగే గ్రామాలు ఇవే..
మొత్తం పది గ్రామాల్లో భూమిని సేకరించనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. అనంతరం వాటిని మున్సిపల్ శాఖకు బదలాయిస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. తాడేపల్లి మండలంలోని నవులూరు-215 ఎకరాలు, కృష్ణాయపాలెం-37 ఎకరాలను సేకరిస్తారు. పెదకాకాని మండలం పరిధిలోకి వచ్చే కృష్ణాయపాలెం-1308, మంగళగిరి మండలంలోని నిడమర్రు-10247, దుగ్గిరాల మండలంలోని కృష్ణాయపాలెం-2500 ఎకరాలను సేకరించనుంది. కృష్ణాయపాలెం గ్రామ పరిధి తాడేపల్లి పెదకాకాని, దుగ్గిరాల మండలాల్లో విస్తరించడం వల్ల దాన్ని మూడు భాగాలుగా విభజించారు అధికారులు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేసన్ పరిధిలో
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఐనవోలు-53.1007, కృష్ణాయపాలెం-63.186, కురగళ్లు-38.3062, నిడమర్రు-332.0436, మందడం-169.31 ఎకరాలను సేకరించనుంది. ఒక్క విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 28,952 మంది లబ్దిదారులను గుర్తించారు. మిగిలిన గ్రామాల్లో 25,355 మంది లబ్దిదారులు ఉన్నారు. వారందరికీ సొంతింటిని నిర్మించుకోవడానికి 1251.5065 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది.
లబ్దిదారులకు ఒక్కో సెంటు భూమి..
అధికారులు సేకరించిన ఈ భూమిలో అర్హులైన లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటు చొప్పున భూమిని పట్టా రూపంలో అంద చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన లేఅవుట్ అభివృద్ధి, డీమార్కింగ్.. వంటి పనులను సీఆర్డీఏ అధికారులు చేపట్టాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మహిళల పేరు మీద మాత్రమే ఈ ఒక్కో సెంటు భూమిని అందజేస్తారు. దీన్నంతటినీ పర్యవేక్షించడానికి కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, సీఆర్డీఏ కమిషనర్తో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
మరో తిరుగుబాటు తప్పదా?
అమరావతి గ్రామాల్లో భూసేకరణకు ఆదేశించిన ప్రభుత్వం.. తన ఉద్దేశమేంటో స్పష్టం చేసినట్టయింది. అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి, హైకోర్టును కర్నూలుకు తరలించడాన్ని నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా రాజధాని నిర్మాణానికి ఉద్దేశించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచి పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించడం మరో దుమారానికి దారి తీస్తుందని అంటున్నారు.