నేనేమైనా టెర్రరిస్ట్నా? లేచేసరికి చుట్టూ పోలీసులు: బాబుపై దాసరి ఆగ్రహం
రాజమహేంద్రవరం: తాను కాపుల కోసం దీక్ష చేస్తున్న తన మిత్రుడు ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, నేను ఈ దేశ పౌరుడినా? లేక తీవ్రవాదినా? అని దర్శకరత్న దాసరి నారాయణ రావు సోమవారం నాడు ఘాటుగా ప్రశ్నించారు.
తాను నిన్న (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరితో ఈ రోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నానని చెప్పారు. తనను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. తాను సూర్యాపేటకు వచ్చేసరికి తనకు ఓ సందేశం వచ్చిందని, నందిగామ వద్ద పోలీసులు మోహరించారని తెలిపారన్నారు.
తనను ముందుకు వెళ్లనీయరని చెప్పారని, అరెస్టు చేస్తారని చెప్పారన్నారు. దీంతో తాను ఖమ్మం, సత్తుపల్లి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్కడా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఆ తర్వాత వేరే మార్గంలో వచ్చేందుకు ప్రయత్నించానని పోలీసులు అడ్డుకున్నారని, తాను ఎన్నో దారులు మార్చుకొని వచ్చానని చెప్పారు.
ముద్రగడ చేస్తున్న దీక్షను చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. ముద్రగడకు మద్దతు తెలిపేందుకు వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటన్నారు. తాను ఉదయం ఇక్కడకు చేరుకొని కాసేపు హోటల్లో పడుకొని వెళ్దామనుకున్నానని, లేచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉన్నారన్నారు.
నిన్న సాయంత్రం నేను బయలుదేరితే ఈ రోజు చేరుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏమైనా తీవ్రవాదినా అన్నారు. పోలీసులు అడుగడుగునా ఇబ్బంది కలిగించారన్నారు. నిరాహార దీక్ష చేస్తూ అనారోగ్యంగా ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎంతోమంది నిరాహార దీక్ష చేశారని, వారికి మరెంతోమంది సంఘీభావం తెలిపారని, ఎక్కడా ఎవరినీ ఆపిన సందర్భాలు మనం చూడలేదన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటిసారి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని ఆపడం ఏపీలో చూస్తున్నామన్నారు.
ఇదేం పద్ధతి అని ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. చట్టం వారికే కాదని, మాకూ ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చేది సమస్యలు పరిష్కరించడానికేనని చెప్పారు. నేను కిర్లంపూడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని పంపితే సంతోషిస్తానని, పంపించకున్నా సంతోషిస్తానని ఎద్దేవా చేశారు.