రాష్ట్రం నుంచి ఎన్నిక కాకున్నా.. ఏపీ కోసం గళమెత్తుతున్నా : వెంకయ్య
తిరుపతి : సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మరోసారి మోడీ దమ్మేంటో రుజువైందన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. ఏపీ ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ.. ఉద్దేశపూర్వకంగా బీజేపీకి ఎవరిపై కక్ష గట్టే అవసరం లేదన్నారు. శనివారం నాడు తిరుపతిలోని పీఎల్ఆర్ గార్డెన్స్లో సన్మానం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, కాంగ్రెస్ వైఫల్యం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందన్న వెంకయ్య.. ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ లోటు భర్తీకి ఎన్డీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి హోదాతో ఎన్ని లాభాలు కలుగుతాయో ఆ స్థాయిలోనే ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజనను సహేతుకంగా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఏపీని గాలికొదిలేసిన కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పోలవరం ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు వెంకయ్య. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్న వెంకయ్య.. అందుకయ్యే నిర్మాణ ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం విభజన బిల్లులోని ప్రతీ అంశంపై ఏపీ మంత్రులతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు వెంకయ్య. ఇక రాబోయే రోజుల్లో ఏపీకి గిరిజన యూనివర్సిటీని కేటాయించడంతో పాటు తిరుపతిని మోడల్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దుతామని హామి ఇచ్చారు. 'ఐఐటీలు, ఎయిమ్స్ వంటివి చట్టంలోనే ఉన్నాయి! కొత్తగా మీరిచ్చేదేందంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చట్టంలో ఉన్న ఎన్నో అంశాలను గతంలో కాంగ్రెస్ నెరవేర్చిందా?' అని ప్రశ్నించారు.
ఇక గతంలో తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికైనా.. ఏపీ ప్రత్యేక హోదా కోసం తన రాజ్యసభలో తన గళం వినిపించానన్నారు వెంకయ్య. ప్రస్తుతం రాజస్తాన్ తరుపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. తాను రాష్ట్రానికి చేసే సేవ మాత్రం కొనసాగుతూనే ఉంటుందన్నారు.