మతి చెడిందేమో: ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న బాబుపై అంబటి
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుపై క్రమంగా విమర్శలు ప్రారంభమవుతున్నాయి. లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ ఇప్పటికే చంద్రబాబు పిలుపుపై మండిపడగా, తాజాగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.
కుటుంబ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబుకు మతిభ్రమించేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సమంజసం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
చంద్రబాబు చేసేతున్న ప్రకటనలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా ఉన్నాయని రాంబాబు విమర్శించారు. యువ దంపతులు చంద్రబాబు మాటలు విని మోసపోవద్దని ఆయన సూచించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో అడుగు పెడితే పదవి పోతుందన్న చంద్రబాబు నమ్మకాన్ని చూస్తుంటే మూఢ విశ్వాసాలను పెంపొందించేలా ఉన్నారని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామితో ఎన్టీఆర్ను చంద్రబాబు పోల్చడం సరి కాదని ఆయన అననారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్పై ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన భూకేటాయింపులచడ సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో బయటపడుతుందని అంబటి రాంబాబు అన్నారు.