మూడు రాష్ట్రాల బిల్లుతో మూడు రాజధానులు ! జగన్ కు అమరావతి బహుజన జేఏసీ ప్రతిపాదన..

ఏపీలో రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలా, అమరావతితో పాటు విశాఖ, కర్నూలు రూపంలో మూడు రాజధానులు ఉండాలా అనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అమరావతి రైతులు ఇప్పటికే అరసవిల్లికి పాదయాత్ర చేస్తుండగా.. ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి బహుజన జేఏసీ సీఎం జగన్ కు తాజాగా ఓ ప్రతిపాదన చేస్తూ లేఖ రాసింది.

సీఎం జగన్ కు అమరావతి బహుజన జెఎసి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య లేఖ రాశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు చేస్తున్న అరసవల్లి పాదయాత్ర నేపథ్యంలో మీరు, మీ మంత్రివర్గ సహజరులు రాజధాని పైనా, తద్వారా మధ్యాంధ్ర ప్రాంతం పైనా దాడికి, విష ప్రచారానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణం జరిగితే, లక్షల కోట్లు అమరావతిలోనే ధార పోయాలని, అమరావతి ఒక్కటే బాగుపడుతుందని, అమరావతి ప్రాంత రైతులు స్వార్థపరులని, ఇతర ప్రాంతాలు బాగుపడితే చూసి ఓర్వలేరన్న రీతిలో మంత్రుల చేత వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టారని ఆరోపించారు. దండయాత్ర, శవయాత్ర, రాజకీయ యాత్ర, స్వార్థపరుల యాత్ర, వ్యాపారుల యాత్ర పేర్లతో మేము ఏపీలో లేము అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

amaravati bahujana jac proposed cm jagan to bring bill for three states for 3 capitals

రేపో, మాపో ఉత్తరాంధ్ర, రాయల సీమ జెఏసీలు ఏర్పాటు చేసి ఆ రెండు ప్రాంతాలను మా మధ్యాంధ్ర ప్రాంతం పైకి ఉసిగొలిపే పనిలో నిమగ్నమయ్యారన్నారు. అమరావతి ఎలా నిర్మాణమైందో, దానికి భూములు రైతులు ఎలా ఇచ్చారో, నాటి అసెంబ్లీ తీర్మానానికి మీరు మద్దతు ఎలా పలికారో, 2019 ఎన్నికలకు ముందు రాజధాని గూర్చి మీరు ఏం చెప్పారో అనే అంశాలను నేను ప్రస్తావించదలచుకోలేదని, రాజధాని ఉద్యమం ఎన్ని రోజులుగా జరుగుతుందో, మహిళలు పడే కన్నీటి అవస్థలు ఏమిటో, న్యాయస్టానం ఇచ్చిన తీర్పు, మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం,సిఆర్డిఏ ఒప్పందాన్ని అమలు చేస్తామన్న అఫిడవిట్ దాఖలు, సుప్రీం కోర్టులో పిటీషన్ వంటి విషయాలను కూడా గుర్తు చేయదలుచుకోలేదన్నారు

కానీ విభజిత రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు అన్నది రాష్ట్ర ప్రజల అందరి కోరికని అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోటయ్య తెలిపారు. అది విజయవాడ,గుంటూరు జంట నగరాల మధ్య ఉందని, మీకు విజయవాడ మళ్ళీ రాజధాని వైభవం సంతరించుకోవడం ఇష్టం లేదని ఆక్షేపించారు. ఇది మీ తప్పు కూడా కాదని, వారసత్వంగా మీ సామాజిక వర్గం వారు చేసిన ద్రోహం అని చెప్పేందుకు బాధగా ఉందన్నారు. 1953 లోనే విజయవాడ రాజధాని కావాలని, ఆరోజు కూడా కమ్మ,కమ్యూనిస్టులు అనే రెండు మాటలను బూచిగా చూపి విజయవాడ రాజధాని కాకుండా కాళ్ళు అడ్డు పెట్టారన్నారు. కర్నూలుకు తీసుకుపోయి మీరు బాగుపడీందీ లేదు,మమ్మల్ని బాగు చేసిందీ లేదన్నారు.

2014 తర్వాత ఉమ్మడి ఏపీ విభజన బిల్లుతో విజయవాడకు రాజధాని మహాభాగ్యం మరో మారు కలిగిందని, అది కూడా విజయవాడ ప్రాంతంలోని 29,881 మంది రైతులు, 34,348 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధపడటం వల్లేనన్నారు. మీరు మళ్ళీ కమ్మ కార్డు అడ్డు పెట్టారని, రాజకీయాలను బూచిగా చూపెడుతున్నారన్నారు.విజయవాడకు రాజధాని భాగ్యం కలుగకూడదని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అధికార బలంతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చారని, ఆ మంటల్లో మొత్తం రాష్ట్రన్నే తగలపెడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రాలను విభజించాలన్నా, కలపాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ద్వారా చేయవచ్చని, ఈ విషయం మీకే బాగా తెలుసని అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోటయ్య తెలిపారు. మీకు 151సీట్ల బలం అసెంబ్లీలోను, 22 మంది ఎంపీలు పార్లమెంట్లోనూ, మరో 10 మంది ఎంపీలు రాజ్యసభలో నూ ఉన్నారని, అసెంబ్లీలో మూడు రాజధానులకు బదులుగా మూడు రాష్ట్రాల బిల్లు పెట్టాలని ఆయన కోరారు. దాన్ని కేంద్రానికి పంపమన్నారు. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం 4 జిల్లాలలోని కోటి 20 లక్షల మంది జనాభా కలిగిన రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగానూ, విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లోని కోటి 10 లక్షల మంది జనాభా గలిగిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రంగాను, కృష్ణ, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి 6 జిల్లాలలోని రెండు కోట్ల 80 లక్షల మంది జనాభా కలిగిన మధ్యాంధ్ర ప్రాంతాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గాను విభజించాలని కోరారు. ప్రజా రాజధాని అమరావతిని మధ్యాంధ్రప్రదేశ్ కు వదిలేయాలన్నారు.

రెండు ప్రత్యేక రాష్ట్రాల్లో పూర్తి భవన సముదాయాలు, అసెంబ్లీ, సచివాలయం ,న్యాయస్థానం అన్ని ఉన్న 2 రాజధానులను కట్టమని సూచించారు. కాగల కార్యం గంధర్వలు తీరుస్తారని పెద్దలు అంటారని, ఇప్పటికే విజయవాడలో ఉన్న కృష్ణా రివర్ బోర్డు, హెచ్ఆర్సీ, తెలుగు అకాడమీ, వక్స్బ్ బోర్డు లను తరలించేశారన్న సంగతి గుర్తు చేశారు. ఈ ఏడాదిన్నర పాలనా కాలంలోనే మూడు రాష్ట్రాల బిల్లును తీసుకుని వస్తే మూడు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి, కలిసికట్టుగా తెలుగోళ్ళు అనే భావంతో బతుకుతారని, మూడు రాష్ట్రాలు చేసిన ఘన చరిత్ర మీ సొంతం అవుతుందని బాలకోటయ్య సీఎం జగన్ కు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+