కృష్ణా నది పక్కనే ఆకాశహర్మ్యాలు: ఇదీ మాస్టర్ ప్లాన్ చూడొచ్చు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ విడుదలైంది. 2050 నాటి అవసరాలకు అనుగుణంగా బృహత్ ప్రణాళికను సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్లో భూవినియోగ గణాంకాలు మారాయి. వాణిజ్య, పారిశ్రామిక భూమి తగ్గింది.
హైస్పీడ్ రైళ్లు, జల మార్గాలతో ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థకు ప్రణాళికలో చోటు కల్పించారు. ఆర్థిక శక్తి కేంద్రంగా కొత్త రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు. దాదాపు ఏడువేల హెక్టార్లు నివాస ప్రాంతాలకు, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దాదాపు మూడువేల నాలుగువందల హెక్టార్లు, పౌరసేవల మౌలిక సదుపాయాలకు దాదాపు రెండువేల హెక్టార్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలకు దాదాపు ఆరున్నరవేల హెక్టార్లు ఉంటాయి.
అమరావతి మాస్టర్ ప్లాన్ను సీఆర్డీఏ వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 7 పీడీఎఫ్ ఫార్మాట్లోని ఫైళ్లను సీఆర్డీఏలోని వెబ్ పేజీలో ఉంచింది. వీటిల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని పరిధిలోకి వచ్చే మండలాల వివరాలను, రాజధాని మాస్టర్ ప్లాన్ హైరెజల్యూషన్ ఫోటోలను ఉంచింది.
వీటిపై ప్రజలకు అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా అంటే, జనవరి 24లోగా తెలియజేయాలని పేర్కొంది. అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా లేదా తెలియజేయవచ్చని, సీఆర్డీఏ చిరునామాకు పోస్ట్ కూడా చేయవచ్చని చెప్పింది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఫైళ్లను ఉంచింది.
ఈ మాస్టర్ ప్లాన్ వివరాల ప్రకారం... కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి, బావులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, జీ కొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోటవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరుల్లపాడు, విజయవాడ అర్బన్, రూరల్, ఉయ్యూరు మండలాలను చేర్చారు.
గుంటూరు జిల్లాలో... అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెద్దకూరపాడు, పెద్దకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తెనాలి, చుండూరు, తుళ్ళూరు, వట్టి చెరకూరు, వేమూరు మండలాలను కలిపారు. కృష్ణా నది పక్కనే ఆకాశహర్మ్యాలు నిర్మిస్తారు.