Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..!
అమరావతి (Amaravati)ని ఏపీకి శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ విభజన చట్టానికి సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ మేరకు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో పెట్టి ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదం లభించడం లాంఛనమే. దీంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తాజా మార్పులతో రాజధాని నగరంగా మారబోతున్న అమరావతికి పిన్ కోడ్ కేటాయించేందుకు కేంద్రం సిద్దమవుతోంది.
ఏపీ రాజధానిగా అమరావతి ఖరారవుతున్న సందర్భంగా లాయర్ కమ్ సామాజిక కార్యకర్త కూడా అయిన వి.రమేశ్ చంద్ర వర్మ దాఖలు చేసిన ఓ ఫిర్యాదుపై తపాలాశాఖ స్పందించింది. అమరావతికి పిన్ కోడ్ ఎప్పుడు వస్తుందని, రాజధానిలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి ఇప్పటికే భూమిని సేకరించినట్లు తెలిపింది. అలాగే ఈ జీపీఓ నిర్మాణం పూర్తయిన వెంటనే సర్కిల్ కార్యాలయం అనుమతి తీసుకుని కొత్త పిన్ కోడ్ కేటాయిస్తామని వెల్లడించింది.

అలాగే ఆధార్, పాస్పోర్ట్ సేవలు, ప్రత్యేక పిన్ కోడ్ వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తపాలా శాఖ తెలిపింది. కొత్త జీపీవో నిర్మాణం జరిగే వరకూ ప్రస్తుతం ఉన్న సబ్-ఆఫీసుల ద్వారా ఈ తపాలా సేవలు కొనసాగుతాయని సమాచారం ఇచ్చింది. రాజధానిలో ఇప్పటికే తపాలాశాఖతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం భూములు కేటాయించింది. దీంతో జనరల్ పోస్ట్ ఆఫీస్ సహా పలు నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇవి పూర్తయ్యేనాటికి పిన్ కోడ్ కూడా అందుబాటులోకి వస్తుంది.












Click it and Unblock the Notifications