Exclusive: చంద్రబాబు కొత్త స్ట్రాటజీ : పవన్ - బీజేపీని "ఫిక్స్" చేసేలా..!!
టీడీపీ అధినేత రాజకీయంగా కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలకు ఐక్య వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అమరావతిని వేదికగా మలచుకుంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలసొచ్చే వచ్చే ఎన్నికల్లో జనసేన - బీజేపీతో కలిసి వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం. ఇప్పటి వరకు తమతోనే ఉన్నారనుకున్న పవన్ కల్యాణ్ లో ప్రధానితో భేటీ తరువాత మార్పు వచ్చినట్లు టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
అమరావతి కేంద్రంగా భారీ సభ
అదే సమయంలో బీజేపీ నుంచి ఇప్పటి వరకు తిరిగి కలిసేందుకు సానుకూల సంకేతాలు రావటం లేదు. ఇక.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వ్యవహరిస్తున్న తీరును బీజేపీతో సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో..అమరావతి వేదికగా వీరందరిని ఆహ్వానించి తొలుత బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశానికి పార్టీలు - రాజకీయాలకు అతీతంగా అమరావతి రైతులకు అండగా నిలిచేందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఆ సభా వేదికగానే..ప్రజాస్వామ్య పరిరక్షణ - ప్రతిపక్షాల ఐక్యతకు నాంది పలకాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటుగా వామపక్షాలు.. కాంగ్రెస్ నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

పవన్ తో సహా అన్ని పార్టీలకు ఆహ్వానం
ఇక, మూడు రాజధానుల గురించి వైసీపీ విశాఖ కేంద్రంగా చేస్తున్న పోరాటానికి కూడా ఇదే సభ ద్వారా కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందు కోసం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో స్థానికంగా హైకోర్టుకు మద్దతుగా నిరసనలు జరిగాయి. కానీ, చంద్రబాబు స్పందించలేదు. ఉత్తరాంధ్ర - రాయలసీమ నుంచి ప్రజలను సమీకరించి అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్ర నిలిచి పోయింది. ఈ సమయంలో అమరావతి అంశం లో ఏకాభిప్రాయంతో ఉన్న అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ..ఆ పార్టీల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ అడుగులు వేయాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం డిసెంబర్ 18న ముహూర్తంగా నిర్ణయించారు.
ఆ సభ ద్వారా పార్టీల ఐక్యత దిశగా అడుగులు
అప్పటికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతుంది. అదే సమయంలో అమరావతి రైతుల పోరాటం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కానుంది. ప్రభుత్వం తమ బహిరంగ సభకు అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా చర్చ సాగుతోంది. అనుమతి ఇచ్చినా..లేకున్నా అందరు నేతలు అమరావతికి వెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహానికి చంద్రబాబు పదును పెడుతున్నారు. గతంలో తిరుపతిలో అమరావతి రైతుల యాత్ర ముగింపు సభలోనూ నేతలంతా హాజరయ్యారు. అయితే, ఈ సభకు చంద్రబాబు టీడీపీ అధ్యక్ష హోదాలో కాకుండా.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఇప్పుడు చంద్రబాబు అమలు చేయాలని భావిస్తున్న ఈ రాజకీయ పునరేకీకరణ సభకు పవన్ కల్యాణ్..బీజేపీ నేతల నుంచి ఏ మేర మద్దతు వస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications