రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్..
రాజమండ్రిలో వాతావరణమంతా టెన్షన్.. టెన్షన్ గా ఉంది. కారణం.. అమరావతి రైతుల పాదయాత్ర ప్రవేశంతో ఏం జరగబోతోంది? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు గత నెల 12వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నుంచి అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయం వరకు 60 రోజులపాటు యాత్ర సాగనుంది.
నాలుగో వంతెనమీదగా రాజమండ్రికి..
34 రోజుల పాదయాత్రను పూర్తిచేసుకున్న రైతులు ఆదివారం తమ యాత్రకు విరామం ప్రకటించారు. సోమవారం కొవ్వూరు నుంచి ప్రారంభమయ్యే యాత్ర గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమండ్రి మల్లయ్యపేటకు చేరుకుంటుంది. రైల్ కమ్ రోడ్ వంతెనపై ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అమరావతి రైతులు తమ యాత్రను ఈ మార్గంలోకి మార్చారు. వాస్తవానికి కొవ్వూరు నుంచి బయలుదేరిన యాత్ర కొవ్వూరు వంతెన మీదగా రాజమండ్రి పట్టణంలోకి ప్రవేశించాలి. అయితే రోడ్ కమ్ రైలు బ్రిడ్జికి మరమ్మతుల కారణంగా వారంరోజులపాటు మూసేస్తూ కలెక్టర్ ప్రకటన జారీచేశారు.
అమరావతి రైతులను అడ్డుకోవడానికే..
అమరావతి రైతులను అడ్డుకోవడానికే ఇలా చేశారంటూ రైతులతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. కొవ్వూరులో రైతులు బస చేసినచోటకు కొవ్వూరు టౌన్ సీఐ రవికుమార్ తోపాటు మరికొందరు పోలీసులు వచ్చి యాత్ర సాగే మార్గానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా యాత్ర కొత్తమార్గంలోకి మారడంతో ఎంతమంది పాల్గొంటారో తెలపాలంటూ నోటీసులు జారీచేయబోగా జేఏసీ నేత తిరుపతిరావు దాన్ని తిరస్కరించారు. తాము న్యాయస్థానం అనుమతితో యాత్రను చేస్తున్నామని ఏమైనా చెప్పాలనుకున్నా, నోటీసులివ్వాలనుకున్నా న్యాయస్థానంద్వారానే రావాలని స్పష్టం చేశారు. పోలీసులు ఒత్తిడి చేయబోగా పాదయాత్ర పొడువనా అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని, ఇంకా ఇంకా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ తిరుపతిరావు సీఐ కాళ్లపై పడబోయారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పి వెళ్లిపోయారు.
పోలీసులు వచ్చిన తర్వాతే సమస్య?
అయితే సమస్య అనేదే లేదని, పోలీసులు వచ్చి కొత్తగా సమస్యను సృష్టిస్తున్నారంటూ తిరుపతిరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం 8.00 గంటలకు పాదయాత్ర ప్రారంభమై నాలుగో వంతెన మీదకు చేరుకున్న తర్వాత ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాదయాత్రకు ఆటంకం కల్పించవద్దంటూ డీజీపీ ఆదేశాలు జారీచేశారు. నిరసనలు తెలుసుకుంటే తెలుపుకోవచ్చని, కానీ పాదయాత్రకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాత్ర ప్రారంభించిన పొడవునా అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మీడియా సమావేశంలో అమరావతి రైతు చిన్నా కన్నీటిపర్యంతమయ్యారు.