అమరావతి రైతుల పాదయాత్ర పున:ప్రారంభం
'అసెంబ్లీ టు అరసవెల్లి' పేరుతో 60 రోజులపాటు 600 కిలోమీటర్ల మేర చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి విడతగా 'న్యాయస్థానం టు దేవస్థానం' పేరుతో పాదయాత్ర చేశారు.

సంకల్పానికి సంఖ్యతో పనిలేదు
ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ఈ నెల 28వ తేదీ నుంచి యాత్ర పున:ప్రారంభం కాబోతున్నట్లు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు. ''సంకల్పానికి సంఖ్యతో పనిలేదని, నవంబరు 28వ తేదీ నుంచి పాదయాత్ర పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని'' రాసుకొచ్చారు.

రామచంద్రాపురంలో నిలిచిపోయిన యాత్ర
రెండో విడత చేస్తున్న పాదయాత్ర సందర్భంగా దారిపొడవునా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి రైతులకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కొందరు నల్లబెలూన్లతో నిరసన తెలియజేయగా రాజమండ్రి ఎంపీ భరత్ తన మందీ మార్బలంతో విధ్వంసకర సంఘటనలకు కారకులయ్యారు. పోలీసులు గుర్తింపుకార్డుల కోసం పట్టుబట్టడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో యాత్రను నిలిపివేశారు. ఆ సమయంలో రైతుల పాదయాత్రకు ముందుండే రథంలో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను రామచంద్రాపురం డీఎస్పీ దౌర్జన్యంగా తీసుకువెళ్లారు.

ఐడీకార్డులు చూపించాల్సిందేనన్న పోలీసులు
అమరావతి రైతులు అరసవెల్లికి పాదయాత్రను సెప్టెంబరు 12వ తేదీన ప్రారంభించారు. హైకోర్టు తీర్పు తర్వాత జరిగిన పరిణామాలతో అక్టోబరు 20వ తేదీ వరకు యాత్రను నిర్వహించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో పాదయాత్ర ఆగిపోయింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం యాత్రలో 600 మంది పాల్గొనాలని, అందరూ గుర్తింపుకార్డులు చూపించాలని పోలీసులు అడిగారు. రైతులకు సంఘీభావం తెలియజేసేవారు వచ్చిన సందర్భంలో కోలాహలం నెలకొంటుండటంతో ఐడీకార్డులు కచ్చితంగా చూపించాల్సిందేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో కోర్టులోనే తేల్చుకుంటామంటూ రైతులు యాత్రను నిలిపివేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు రండి..
పాదయాత్ర వ్యవహారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. రైతులతోపాటు ప్రభుత్వం కూడా పిటిషన్లు దాఖలు చేసింది. పాదయాత్రను నిలిపివేయాలన్న ప్రభుత్వ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. యాత్రలో 600 మందే పాల్గొనాలని, ఐడీ కార్డులు చూపించాలని, వారందరికీ ఐడీ కార్డులు మంజూరు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. మద్దతు తెలియజేసేవారు రోడ్డుకు ఇరువైపులా పక్కన నిలబడి తెలపవచ్చని, నిరసన తెలియజేసేవారు కొంచెం దూరం నుంచి తెలియజేయవచ్చని తేల్చింది. రైతులు నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి సూచించింది. దీంతో సోమవారం ఉదయం నుంచి యాత్ర పున:ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications