భగ్గుమన్న రాజధాని రైతులు.. ఎమ్మెల్యే ఏం సాధించడానికి వచ్చారు??
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు మరోసారి భగ్గుమన్నారు. వారి నిరసన సెగ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి బాగా తగిలింది. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమాన్ని తుళ్లూరు మండలం మందడంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దీక్షా శిబిరంలో ఉన్న రైతులంతా ఒక్కసారిగా ఎమ్మెల్యేను కలవడానికి బయలుదేరారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసన తెలియజేశారు.

నిరసన తెలియజేసే హక్కు లేదా?
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మందడంలో పర్యటిస్తున్న సమయంలో రైతులంతా శిబిరం నుంచి రహదారిమీదకు వచ్చి వెలుగుతున్న కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలియజేయడంతోపాటు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరినవారిని పోలీసులు అడ్డుకోవడంతో రాజధానిలో నిరసన తెలియజేసే హక్కు తమకు లేదా? అని ప్రశ్నించారు. తమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికే వెళుతున్నామని, అయినా ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులను నిలదీశారు.

ఏం సాధించాలని మందడం వచ్చారు?
రైతుల సమస్యలను పరిష్కరించడం చేతకానివారు ఏం సాధించడానికి వచ్చారంటూ నిలదీశారు. తుళ్లూరు మండల ప్రజలు తనకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు తమ ప్రాంతానికి ఎందుకువచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పింఛన్లు ఇవ్వకుండా, కౌలు చెల్లించకుండా, ప్రభుత్వం సాకులు చెబుతోందంటూ మండిపడ్డారు.

రోడ్లను తవ్వేవేరిని అడ్డుకోండి
రైతులను అడ్డుకోవడం కాదని, రాజధానిలో రోడ్లను తవ్వుకుంటూ పోయేవారిని అడ్డుకోవాలని, వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, దాన్నే కొనసాగిస్తామంటూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనచేసే వరకు తమ ఉద్యమం విరమించేది లేదని స్పష్టంచేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు త్వరలోనే 1000 రోజులకు చేరువ కాబోతున్నాయి.












Click it and Unblock the Notifications