ప్రధాని, రాష్ట్రపతికి అమరావతి జేఏసీ లేఖలు-మూడేళ్లలో వైసీపీ సర్కార్ 1100 దాడులంటూ..
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల కోసం వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అమరావతి జేఏసీ నేతలు లేఖలు రాశారు. గత మూడేళ్లలో అమరావతి రాజధాని కోసం తాము చేస్తున్న ఉద్యమం, దాన్ని అణగదొక్కేందుకు వైసీపీ సర్కార్ చేయిస్తున్న దాడుల్ని అందులో ప్రస్తావించారు. రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలని వారు కోరారు.
అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ మూడేళ్లుగా ఇక్కడి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ఇందులో 200 మంది రైతులు చనిపోయారని ప్రధాని, రాష్ట్రపతి, అమిత్ షాకు రాసిన లేఖల్లో జేఏసీ పేర్కొంది. అలాగే అమరావతి ఉద్యమంపై ఇప్పటివరకూ వైసీపీ సర్కార్ 1100 దాడులు చేయించిందని అందులో పేర్కొన్నారు. కాబట్టి ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. తద్వారా వేలాది ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ అమరావతి రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఢిల్లీలో మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చిన రైతులు.. ఇవాళ తొలిరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. రేపు కేంద్ర పెద్దల్ని కలిసి అమరావతి సమస్యను వివరించబోతున్నారు. మూడో రోజు సోమవారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో వారు బహిరంగ సభ నిర్విహంచబోతున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆందోళనలు చేయడం ద్వారా కేంద్ర పెద్దలు, ఎంపీల దృష్టిని ఆకర్షించాలని అమరావతి రైతులు భావిస్తున్నారు.