ఆసక్తి: అమరావతి శంకుస్థాపన ముగిసినా తరలి వస్తున్న జనాలు
గుంటూరు: రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ముగిసినా ఆయా గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల వారు ఉద్దండరాయనిపాలెం వస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరావతి ఎగ్జిబిషన్ స్టాల్ను సందర్శిస్తున్నారు.
వాటిని చూసేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మన నీరు - మన మట్టి - మన అమరావతి, శిలా ఫలకం, ఎగ్జిబిషన్ స్టాల్ల వద్ద కుటుంబ సమేతంగా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో ఇక్కడ చేసిన ఏర్పాట్లను తొలగించలేదు.
Photos: అమరావతి శంకుస్థాపన
దీంతో కొందరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో శంకుస్థాపన ప్రాంతంలో ఉన్న ఎగ్జిబిషన్ స్టాల్, మిగిలిన తాత్కాలిక ఏర్పాట్లను తొలగించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శిలా ఫలకం పైన ప్రభుత్వం కేవలం కార్యక్రమానికి వచ్చిన ప్రముఖుల పేర్లు ముద్రించి వారికి తగిన గౌరవం కల్పించిందని, అదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా శిలాఫలకంపై చేర్చవలసి ఉండెనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, శంకుస్థాపన సమయంలో పోలీసులతో పాటు సేవలు అందించిన రాజధాని యువత 298 మందిని పోలీసు శాఖ అభినందించనుంది. వచ్చే వారంలో రాజధాని ప్రాంతంలో అభినందన కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.