అమరావతి: ఢిల్లీ-బెజవాడ స్పైస్జెట్ ప్రత్యేక సర్వీస్లు, ప్రధాని రక్షక దళం ఎంట్రీ!
అమరావతి/ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో స్పైస్ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. ఈ నెల 21, 22 తేదీలలో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధులు బుధవారం నాడు తెలిపారు.
ఢిల్లీ - విశాఖపట్నం, విశాఖపట్నం - హైదరాబాద్, ఢిల్లీ - హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడ, విజయవాడ - ఢిల్లీకి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ రూట్లలో ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతామని చెప్పింది.
రాజధాని అమరావతి వేడుకను ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని వేడుక ప్రారంభమైంది. దసరా పర్వదినం నాడు ప్రధాని మోడీ, దేశ, విదేశీ ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు నడపాలని స్పైస్ జెట్ నిర్ణయించింది.
రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన చంద్రబాబు
రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం చంద్రబాబు రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను పరిశీలించి ఆ తర్వాత హెలికాప్టర్లో గన్నవరం బయలుదేరారు.
ఎస్పీజీ భద్రతలోకి ఉద్దండరాయునిపాలెం: రేపే ప్రధాని రక్షక దళం రాక
ఏపీ నూతన రాజధాని అమరావతికి ఈ నెల 22న విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలో ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) రంగంలోకి దిగనుంది. అమరావతి శంకుస్థాపన కేంద్రం ఉద్దండరాయునిపాలెం పరిసరాలను ఎస్పీజీ బృందం తన అధీనంలోకి తీసుకోనుంది. ఎస్పీజీ గురువారం ఉద్దండరాయునిపాలెం రానుంది. ప్రధాని పర్యటన ముగిసేదాకా భద్రతపై నిఘా ఉంచనుంది.