తుది దశకు హైకోర్టులో రాజధాని విచారణ- మళ్లీ వేడెక్కిన అమరావతి-పోటాపోటీ ఆందోళనలు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన వందకు పైగా పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకుంటోంది. అమరావతి స్ధానంలో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజదానులు అవసరమా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు జరుపుతున్న విచారణలో ఇప్పటికే పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తికాగా.. ప్రస్తుతం ప్రభుత్వం వాదనలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే హైకోర్టు ధర్మాసనం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కలుగుతుంది. దీంతో అమరావతి కూడా మరోసారి వేడెక్కుతోంది. అమరావతి అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలు, కేసులు, పోలీసుల కదలికలు, ఆంక్షలతో అమరావతి రణరంగాన్ని తలపిస్తోంది.

చివరి దశకు రాజధాని విచారణ
అమరావతి స్ధానంలో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని నేరుగా రాజధానితో సంబంధం ఉన్న పిటిషన్లు, స్టేలు కోరుతూ దాఖలైన పిటిషన్లుగా వర్గీకరించిన హైకోర్టు ఇప్పటికే దాదాపు ప్రధాన పిటిషన్లపై విచారణను పూర్తి చేసింది. సంక్రాంతిలోపు మిగతా పిటిషన్ల విచారణ కూడా కొలిక్కి వస్తందని భావిస్తన్నారు. దీంతో సరిగ్గా ఏడాది క్రితం వైసీపీ సర్కారు మూడు రాజదానుల ప్రకటన చేయగానే అమరావతిలో నెలకొన్న పరిస్ధితులే పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అంతే వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతోంది.

అమరావతిలో పోటాపోటీ నిరసనలు..
రాజధాని పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చలికాలంలోనూ అమరావతి వేడెక్కుతోంది. ముఖ్యంగా అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు వేర్వేరు శిబిరాలు కొనసాగుతుండటంతో వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇరు శిబిరాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి వస్తోంది. తాజాగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి అనుకూల శిబిరంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు, దీంతో నిరసనల్లో పాల్గొన్న వారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అమరావతి రైతుల్లో మరింత ఆగ్రహాన్ని నింపింది. మరోవైపు అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో దళిత బహుజన వర్గాల పేరుతో మూడు రాజధానులకు అనుకూలంగా మరో నిరసన సాగుతోంది. దీనికి మరింత ఎక్కువగా భద్రత కల్పించాల్సి వస్తోంది.
Recommended Video

ఆంక్షల వలయంలో అమరావతి
రాజధాని అనుకూల, వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో అమరావతిలో పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే దారుల్లో పోలీసుల నిఘాతో పాటు ఆంక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వెళ్లే మార్గాలు కావడంతో వీటిలో పోలీసులు భారీగా మోహరించి అధికారిక, అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చే సాధారణ ప్రజలు, ఉద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా అమరావతి అనుకూల శిబిరంపై రాళ్ల దాడి తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. హైకోర్టులో రాజధాని పిటిషన్ల విచారణ తుది దశలో ఉండటంతో పోటాపోటీ నిరసనలు కొనసాగుతుండటంతో ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications