అమరావతి-అరసవిల్లి పాదయాత్ర-అనుమతి కోరుతూ హైకోర్టులో రైతుల పిటిషన్
అమరావతి : అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానులు అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అరసవిల్లికి పాదయాత్ర నిర్వహించి ఇతర జిల్లాల వారికి దీనిపై అవగాహన తీసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. గతంలో తిరుపతికి ఇలాగే పాదయాత్ర నిర్వహించిన రైతులు.. ఈసారి అరసవిల్లి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి రాజధానికి మద్దతుగా ఈ నెల12న రైతులు అరసవిల్లికి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 12న ప్రారంభమయ్యే అమరావతి- అరసవెల్లి మహా పాదయాత్రకు దరఖాస్తు చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని పిటిషనర్ పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించారని పరిరక్షణ సమితి తరఫున తెలిపారు.

అమరావతి-అరసవిల్లి పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఇందులో రైతుల తరపున లాయర్ మురళీధర్రావు వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు రిజిస్ట్రీ పిటిషన్ ను లిస్ట్ చేయగానే హైకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించనుంది. మరోవైపు గతంలోనూ తిరుపతి పాదయాత్ర సందర్భంగా కూడా ఇలాగే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications