అమరావతి హైదరాబాద్లా కాకూడదు: పవన్ కళ్యాణ్, మీడియాకు క్షమాపణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాదులో కాకూడదని ఆశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎపి మంత్రులు అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ను కలిసి ఆయనకు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని, నూతన రాజధానిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన అన్నారు. తాను షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్లాల్సి ఉందని, శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానో రానో తెలియదని, రావాలని ఉందని, తాను గుజరాత్ వెళ్లి తిరిగి రావాల్ిస ఉంటుందని ఆయన అన్నారు. సినిమా షూటింగ్ను బట్టి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రావడమనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

తాను సలహాలు ఇచ్చేంతటి వాడిని కానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొటోకాల్ ప్రకారం తన వద్దకు రావడం సరికాదని ఆయన అన్నారు. ద్వేషంతో ఎల్ల కాలం ముందుకు సాగలేమని, ఎక్కడో ఓ చోట సామరస్యపూర్వక వాతావరణాన్ని కల్పించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంచి వాతావరణం ఏర్పడిందని ఆయన అన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ అన్నారు. మంత్రివర్గం ఏర్పాటైనప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారని వారు చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడుతారని వారు చెప్పారు.
ఇదిలావుంటే, ఎపి మంత్రులు నానక్రాంగూడలో సినిమానటుడు పవన్కల్యాణ్ను కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడులు పవన్కల్యాణ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియో దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు. మీడియా సిబ్బందిని లోపలకు అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. ఓ చానెల్ కెమెరామన్ కిందపడిపోయారు.
ఈ సంఘటనకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. ఇటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మీడియాకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని తాను కల్పించనని, అయితే అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి మంత్రులు వచ్చినప్పుడు మీడియా సిబ్బందిపై జరిగిన దాడికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.
సాధారణంగా ఎవరో ఒకరు తమ షూటింగ్ ప్రాంతంలోకి వచ్చేస్తుంటారని, కొంత మంది కెమెరాలతో కూడా వస్తుంటే వాళ్లను తమ సిబ్బంది అడ్డుకుంటారని, వచ్చింది మీడియా అని తెలియకపోవడంతో ఇలా చేసి ఉంటారని ఆయన అన్నారు. దెబ్బల తగిలినవాళ్లకు వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు. దాడి చేసినవారిని గుర్తించి వారికి సరైన శిక్ష కూడా ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications