జంట నగరాలుగా అమరావతి-విజయవాడ! 'మై బ్రిక్'కు ఎన్నారైల చెక్కు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి, పక్కనే ఉన్న విజయవాడ నగరాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులో రెండు నగరాలు కలిసి ఒక మెగా సిటీగా ఆవిర్భవిస్తాయని రాజధాని నగర తుది ప్రణాళికను రూపొందించిన సింగపూర్ ప్రభుత్వ సంస్థ అభిప్రాయపడుతోంది.
రాజధాని ప్రాంతంలో గుంటూరు ఒక ప్రాంతీయ కేంద్రంగా ఉంటుందని ముసాయిదాలో పొందుపరిచింది. దానికి తుది మాస్టర్ ప్లాన్లో మరింత స్పష్టత ఇచ్చింది. కృష్ణా నదికి కుడివైపున అమరావతి రాజధాని నగరం, ఎడమ వైపున విజయవాడ నగరం ఉందని, ఈ రెండు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడింది.
త్వరలో నిర్మించబోయే హైస్పీడ్ రైలు, కొత్త హైవే విజయవాడ, అమరావతి నగరం నుంచే ఏర్పాటు కానున్నాయి. గేట్ వేని కూడా విజయనాడ నుంచి నిర్మిస్తున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయానికి అమరావతి నుంచి అరగంటలో చేరుకునేలా ఎక్స్ప్రెస్ హైవేని నిర్మిస్తారు.
గుంటూరు, సత్తెనమల్లి, పామర్రు, గుడివాడ, తెనాలి, నూజివీడు ప్రాంతాలను కలిపి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ రూపొందించారు. బెజవాడ నగరాన్ని... ఓ వైపు కొండపల్లి వరకు, మరోవైపు గన్నవరం పరిసర ప్రాంతాల వరకు విస్తరిస్తారు. ఈ నేపథ్యంలో అమరావతి, విజయవాడలు త్వరలో జంట నగరాలుగా, భవిష్యత్తులో మెగా సిటీగా అభివృద్ధి చెందనున్నాయి.
మంగళగిరిలో తాత్కాలిక సచివాలయం
గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద అమరావతి టౌన్ షిప్ ప్రాంతంలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారని నిర్ణయించారు.
అమరావతి టౌన్ షిప్ వద్ద ఆరు లక్షల అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాల నిర్మించి తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతున్నారు. రాజధాని నిర్మాణం అయ్యే వరకు తాత్కాలిక సచివాలయం నుంచి పాలన సాగిస్తారు. మంత్రులు, అధికారులకు రెయిన్ పార్కులో నివాసాలు ఖరారు చేశారు.
మై బ్రిక్ మై అమరావతికి చెక్కు
న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర రావు ఆదివారం నాడు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 1,16,000 ఇటుకలకు అవసరమయ్యే మొత్తాన్ని చెక్కు రూపంలో ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.