టీడీపీ ఆవిర్భావ దినోత్సవమే ముహూర్తం - అరాచకాలన్నీ బయటకు : అంబటి ఫైర్..!!
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా.. జగన్ పరిపాలన గురించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు. సీఎంగా జగన్ 34 నెలల పాలన.. టీడీపీ 40 ఏళ్ల చరిత్ర పైన చర్చకు సిద్దమేనా అంటూ సవాల్ చేసారు. ఇదే అంశం పైన చర్చకు టీడీపీ నుంచి నారా లోకేష్ ను పంపినా పర్వాలేదని చెప్పారు. తమ ప్రభుత్వ స్థాయి వ్యక్తి కాకపోయినా.. ఆయన తో కూడా చర్చకు సిద్దమేనని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుందని చెప్పారు.
అసలు..తెలుగు దేశం పాలనలో ఏమైనా సంస్కరణ లు జరిగాయా అంటూ రాంబాబు ప్రశ్నించారు. జగన్ పాలనతో మంచితో పాటుగా టీడీపీ హయాంలో జరిగిన దారుణాల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మార్చి 29 టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు చంద్రబాబు చేసిన అరాచకాలను ప్రజలకు వివరిస్తామని అంబటి వెల్లడించారు. ఎన్టీఆర్ నాడు మద్యనిషేధం చేస్తే..చంద్రబాబు దానికి తూట్లు పొడిచి రద్దు చేసారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్ మద్యపాన నిషేధం చేస్తున్నారని వివరించారు. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవటం ద్వారా టెండర్లు..వేలం పాటలు.. పోటీ..కల్తీకి అవకాశం లేకుండా చేసారని చెప్పారు.
ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పారు. సాధారణ మరణాలను సారా మరణాలంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ గురించి అర్దం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో తాము తీసుకొచ్చిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంచామని..నాడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోనే మాయం చేసారంటూ అంబటి ఎద్దేవా చేసారు.