కక్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు - అంబటి..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై తమకు కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదని వివరించారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎప్పటి నుంచో చర్మ సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్యం పై జరుగుతన్న వివాదంపై మంత్రి అంబటి స్పందించారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. చంద్రబాబు కు జైలులో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డీ హైడ్రేషన్ కు గురైనట్లు గుర్తించారు. ఇదే విషయం వెల్లడించిన జైలు అధికారులు వైద్యుల సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. చంద్రబాబు ఆరోగ్యం..భద్రత బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. తాజాగా.. ఏసీబీ కోర్టులో తెలుగుదేశం నేతలు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ విచారించిన కోర్టు..వెంటనే చంద్రబాబుకు శీతల వాతావరణం అవసరమే వైద్యుల సూచన మేరకు ఏసీ ఏర్పాటు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు ఆరోగ్యం పైన స్పందించిన మంత్రి అంబటి.. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఇప్పటి వరకు కోర్టులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 35 రోజులుగా ఏనాడూ చంద్రబాబు లాయర్లు, తమ క్లయింటుకు ఏసీ కావాలని కోర్టులో పిటిషన్ వేయలేదన్నారు.
అంటే దీని అర్థం ఏమిటని నిలదీసారు. గురు, శుక్రవారాల్లో వాదనలు సాగినప్పుడు కూడా ఈ విషయాన్ని కోర్టులో అడగలేదని గుర్తు చేసారు. కోర్టు ఏం చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుందని స్పష్టం చేసారు. ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఏం ఇవ్వకూడదో నిర్ణయించేది కోర్టు అయినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications