జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలో వైఎస్ఆర్సిపి కార్యకర్త హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్యకు గురైన వైసిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న తోపులాట ఘటన తాలూకా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
జగన్ ను టార్గెట్ చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత
తాజాగా వంగలపూడి అనిత వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ క్రిమినల్ నాయకుడైతే ఎలా ఉంటుందో పాపిరెడ్డి పల్లి లో చూసామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ సైకో అని తాజా ఘటనతో వెల్లడైందని ఆమె వ్యాఖ్యలు చేశారు. వైసిపినేతలు కార్యకర్తలు హెలిపాడ్ దగ్గరకు కూడా తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చారని, దీంతో కొంతమంది పోలీసులకు గాయాలు అయ్యాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

వంగలపూడి అనితకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
దీంతో వంగలపూడి అనితకు కౌంటర్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆమె పైన విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ను సైకో, రౌడీ అని అంటున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. టిడిపి నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని, పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
అనిత జగన్ ను కించపరుస్తున్నారు
పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళితే తప్ప కేసులు నమోదు చేసే పరిస్థితి లేదని అన్నారు. జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అని హోంమంత్రి అనిత కించపరుస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. 11సీట్లు ఉన్న జగన్ కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని ఆయన పేర్కొన్నారు.
చీటర్ అన్న బిరుదు చంద్రబాబుకు సరిపోతుంది
హెలికాఫ్టర్ వద్దకు వచ్చిన వందలాదిమంది ఎవరో చెప్పాలని, వారంతా మీ వాళ్ళు కాదా అంటూ ప్రశ్నించిన అంబటి రాంబాబు జగన్ కు సరైన సెక్యూరిటీ ఇవ్వడంలేదని వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, చీటర్ అన్న బిరుదు చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని అంబటి రాంబాబు అన్నారు.












Click it and Unblock the Notifications