దీక్షపై బాబు ద్వంద వైఖరి: ఎన్టీఆర్ చేశారు, నీ దీక్షకు కాంగ్రెస్ అనుమతిచ్చిందన్న అంబటి
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ వైయస్ జగన్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
అహంభావంతో, గర్వంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైనంత మాత్రాన మీరు చెప్పిందే చట్టమా? అని నిలదీశారు. మీరు ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదని, ధర్మంగా, న్యాయంగా ఆలోచించాలని అన్నారు. ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్టు అణచి వేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టబద్ధంగా నిరాహార చేస్తుంటే ఇన్ని ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. దీక్షకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం, వేరే స్థలంలో పెట్టుకుంటే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారని... ఈ ద్వంద్వ విధానాలు ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు మతి భ్రమించిందేమో అనిపిస్తోందన్నారు.

ప్రత్యేక హోదా సాధించడం మీ వల్ల కాకపోతే సమస్యను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ జగన్ ముందుకొచ్చారన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా రైతుల సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు.
అన్నా హజారే కూడా వివిధ కారణాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్నారని, దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండి కూడా అప్పట్లో దీక్షలు చేశారని మీకు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని నిలదీశారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు, ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు పెడతారా అని మండిపడ్డారు.
అదే ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించారని, లోకేశ్ పుట్టినరోజు వేడుకలు కూడా చేశారని, అవి రాజకీయాలు కావుగానీ, ప్రత్యేక హోదాపై సదస్సు పెడితే రాజకీయమా అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications