మేము పద్దతి ప్రకారం వెళ్తున్నాం - ప్రజలను నమ్మించాలనే కుట్ర : మంత్రి అంబటి..!!
మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. పోలవరం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారంటూ మండిపడ్డారు. తమ పైన చల్లుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి జగన్ ప్రభుత్వం కారణం అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేయకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్నదని ఆరోపించారు.
ప్రజలను నమ్మించాలనే కుట్ర పన్నుతున్నారంటూ అంబటి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను మార్చటం వల్ల ఆలస్యం అయిందని వివరించారు. చంద్రబాబు కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ కట్టారని చెప్పుకొచ్చారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం కడితే 45 గ్రామాలు మునిగి పోతాయన్నారు. 35 కాంటూరు లోని గ్రామాలు కేంద్రానికి లేఖ రాశాయని వెల్లడించారు. దీంతో..కేంద్రం కాఫర్ డ్యాం నిర్మాణం ఆపమని చెప్పిందని వివరించారు. ఈ లోగా ప్రభుత్వం మారిందని అంబటి చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పుకు..తమ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు ప్రాజెక్టు ఆలస్యానికి కారణమెవరో చర్చకు రావాలని డిమాండ్ చేసారు.
ట్రాన్స్ ట్రాయ్ ను అడ్డంగా తీసేసి నామినేషన్ పద్ధతిలో నవయుగను చంద్రబాబు తీసుకుని వచ్చారని చెప్పుకొచ్చారు. వేల కోట్ల ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చిన చరిత్ర హీనుడు చంద్రబాబని మండిపడ్డారు. తమ ప్రభుత్వం నవయుగను మార్చి మేఘాకు ఇచ్చిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 12.6 శాతం ప్రాజెక్టుకు ప్రయోజనం కలిగే విధంగా కాంట్రాక్టు మార్చామని వివరించారు. పారదర్శకంగా ఓపెన్ టెండర్ విధానం అనుసరించామని చెప్పారు. తమ ప్రభుత్వం పద్ధతి ప్రకారం పనులు చేసుకుంటూ వెళుతున్నామని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.