టీడీపీ మహిళా నేతకే రక్షణ లేదు!, దౌర్జన్యం చేస్తే ఊరుకోం?: అంబటి
మీ పార్టీ మహిళలకే రక్షణ లేకుండా పోతే ఎలా? ఇక ప్రతిపక్ష పార్టీ మహిళలు, సామాన్య మహిళలకు ఎక్కడినుంచి రక్షణ కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గుంటూరు: జిల్లా చైర్ పర్సన్ షేక్ జానీమూన్ ను మంత్రి రావెల కిషోర్ బాబు అనుచరులు బెదిరింపులకు గురిచేయడం పట్ల ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఎమ్మెల్యే రోజా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా దీనిపై స్పందించిన అంబటి రాంబాబు.. మీ పార్టీ మహిళలకే రక్షణ లేకుండా పోతే ఎలా? ఇక ప్రతిపక్ష పార్టీ మహిళలు, సామాన్య మహిళలకు ఎక్కడినుంచి రక్షణ కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాట వినని వారిపై, టీడీపీ అవినీతికి అడ్డు చెప్పినవారిపై బెదిరింపులకు పాల్పడటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై దౌర్జన్యం చేయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. షేక్ జానీమూన్ ఏం తప్పు చేశారని ఆమెను రావెల అనుచరులు బెదిరిస్తున్నారని నిలదీశారు. సొంత పార్టీ నేతే ఆమెపై దాడి చేయడం దారుణమన్నారు అంబటి. ఆయన్ను అరెస్టు చేసే ధైర్యం పోలీసులకు ఉందా అంటూ ప్రశ్నించారు.
షేక్ జానీమూన్ కు ఎదురవుతున్న బెదిరింపులను తిరిగి వైసీపీ మీదకే నెట్టడానికి టీడీపీ ప్రయత్నించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంబటి అన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలన నడుస్తోందని, చంద్రబాబు, లోకేష్ శాశ్వతం కారని అన్నారు. భవిష్యత్తులో ఒక్క మహిళ కూడా టీడీపీకి ఓటేయబోదని చెప్పారు.