మూడు ఉగాదుల నుండి చంద్రబాబుకు ఉగాదిపచ్చడిలో చేదు మాత్రమే తగులుతుంది: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచడం పై తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన తో పాటు వామపక్ష పార్టీలు కూడా తీవ్రస్థాయిలో జగన్ సర్కార్ పై ధ్వజమెత్తుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను పెంచడం నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. వెంటనే జగన్ తాను తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష నాయకులపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.

లోకేష్ నోరు విప్పడే ... పవన్ కళ్యాణ్ పవర్ చూపించడే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, టీడీపీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం పై నోరు విప్పడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడుతున్న లోకేష్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే నోరువిప్పిడే.. భయమా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా.. మరి ఆయన పవర్ చూపించడే అంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

గత మూడు ఉగాదుల నుండి చంద్రబాబుకు చేదు మాత్రమే తగులుతుంది
ఉగాది పర్వదినం చంద్రబాబుకు గత మూడు ఉగాదుల నుంచి చేదు మాత్రమే మిగులుస్తుందని, ఉగాది పచ్చడి లోని చేదు మాత్రమే చంద్రబాబుకు తగులుతుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి ఉగాది పండుగ మంచి పేర్లతో వస్తోందని పేర్కొన్న ఆయన, ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే అందుతున్నాయని పేర్కొన్నారు.
ఇక లంచాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని వెల్లడించారు. జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.

టీడీపీ నాయకులకు అంబటి సెటైర్లు
కేంద్రం పెంచుతున్న రేట్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికీ అగ్గిపెట్టె,కొవ్వొత్తి పంపిస్తారట.. పంపించండి. దాంతోపాటు పచ్చజెండా కూడా పంపించండి అంటూ పేర్కొన్న అంబటి రాంబాబు మీరు పంపిన అగ్గిపెట్టె తో కొవ్వొత్తి వెలిగించి మీ పచ్చ జెండాను శుభ్రంగా కాల్చి బూడిద చేస్తారంటూ పేర్కొన్నారు. నాలుగు సార్లు కరెంటు చార్జీలు చంద్రబాబు హయాంలో పెరిగాయని పేర్కొన్న ఆయన, బాబు పాలనా కాలంలో మూడుసార్లు బస్సు టికెట్లు పెంచారని వెల్లడించారు.

చంద్రబాబుకు విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడే అర్హత లేదు
చంద్రబాబుకు విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడే అర్హత లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిణామాలతో విద్యుత్ చార్జీలు పెంచటం అనివార్యమైంది అని అంబటి రాంబాబు వెల్లడించారు. 1400 కోట్ల భారం మాత్రమే ప్రజల పై పడితే తెలుగుదేశం పార్టీ 42 వేల కోట్ల భారం వేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తక్కువేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications