బాబు చంపే ప్రయత్నం చేశారు, చిరంజీవి సహా డ్రామాలు, అదే గతి పడుతుంది: అంబటి
అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దానిని ప్రజలు గుర్తించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గురువారం అన్నారు. ఈ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు.
Recommended Video
గతంలో ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ప్రచారం చేశారని అంబటి రాంబాబు చెప్పారు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఆయనకే సాధ్యమని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాను చంపేయాలని ఆయన ప్రయత్నించారన్నారు. బాబుకు సర్వేలు చేయించడం అలవాటే అన్నారు.
సిగ్గులేకుండా, పవన్: బాబుపై కొడాలి నాని, కిరణ్ రెడ్డి కూడా ఇలాగే, వైసీపీలో ఆ రూల్ లేదు
హోదా కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని అంబటి చెప్పారు. నిరాహార దీక్షలు చేశారని, ధర్నాలు చేశారన్నారు. హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమని కూడా ప్రకటించారని చెప్పారు.
అందుకే ఉద్యమంలోకి జొరపడుతున్నారు
ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమంలోకి ప్రవేశించడం కోసమే తిరిగి హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, అఖిల సంఘాల భేటీ అంటున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. తమ నేతృత్వంలో ఉదృతంగా సాగుతున్న ఉద్యమాన్ని నట్టేట ముంచేందుకు ఇందులోకి వస్తున్నారన్నారు.
చంద్రబాబు చంపాలని చూస్తే మేం బతికించాం
ప్రత్యేక హోదా అంశాన్ని చంపాలని చంద్రబాబు చూస్తే తమ పార్టీ బతికించిందని అంబటి అన్నారు. అఖిల సంఘాల భేటీ అంటూ చంద్రబాబు ఇప్పుడు మరోసారి మోసం చేయబోతున్నారని చెప్పారు. ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
చిరంజీవి సహా కాంగ్రెస్ నేతల డ్రామాలు
నాడు విభజన సమయంలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం తదితరులు ఎన్నో ప్రగల్భాలు పలికారని, ఎన్నో డ్రామాలు ఆడారని, అందుకే 2014లో ఆ పార్టీకి దారుణమైన గతి పట్టిందని అభిప్రాయపడ్డారు. అదే గతి హోదా విషయంలో డ్రామాలు ఆడుతున్న బీజేపీకి, చంద్రబాబుకు పడుతుందని అంబటి అన్నారు.
ఎన్టీఆర్ నుంచి బాబు లాక్కున్నారు
స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి సైకిల్ గుర్తు నుంచి పదవి వరకు ఎన్నో లాక్కున్నారని, ఇప్పుడు హోదా ఉద్యమాన్ని కూడా అలా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. వారి డ్రామాలను ప్రజలు గుర్తించాలన్నారు.